కరోనా కలకలం: తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆదివారం పూర్తిస్థాయి లాక్డౌన్
చెన్నై: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో తమిళనాడు రాష్ట్రం ఈ ఆదివారం పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. బస్, రైల్వే స్టేషన్, విమానాశ్రయాల వద్దకు వెళ్తే ఆటోలు, ట్యాక్సీలకు మాత్రం అనుమతిచ్చింది. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చింది.
తమిళనాడులో 28,561 కొత్త కేసులు వెలుగుచూశాయి. 39 మంది మరణించారు. మొత్తం కేసులు 30 లక్షలు దాటాయి. మృతుల సంఖ్య 37వేలు దాటాయి. జనవరి నెలాఖరుకల్లా 10 లక్షల మందికి ప్రికాషనరీ డోసు అందుతుందని తమిళనాడు ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మరోవైపు కేరళ కూడా కరోనా మూడో వేవ్తో కేరళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కఠిన ఆంక్షలను కొనసాగిస్తోంది. వచ్చే రెండు ఆదివారాలు పూర్తి లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది కేరళ సర్కారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. జనవరి 23, జనవరి 30 తేదీల్లో ఈ లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గురువారం కేరళలో 46వేల మందికిపై కరోనా వైరస్ బారినపడ్డారు.
ఇది ఇలావుంటే, కర్ణాటక మాత్రం ఆంక్షలను కాస్త సడలించింది. వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసింది. అయితే, రాత్రి ఆంక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. మాల్స్, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా, దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు కంటే 4.36 శాతం అధికంగా కేసుల సంఖ్య రిజిస్టర్ అయింది. అయితే, గడిచిన 249 రోజుల కాలంలో ఇదే అత్యధికంగా కేసులు నమోదు కావటమని ఆరోగ్య శాఖ చెప్పుకొచ్చింది. కాగా, దేశంలో ప్రస్తుతం మొత్తం 20,18,825 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా నిర్దారించారు.
గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారి సంఖ్య 2,51,777 గా ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు వారీ పాజిటివిటీ రేటు 17.94 శాతం ఉండగా.. వారం పాజిటివిటీ రేటు 16.56 శాతంగా నమోదైంది. ఇక, కర్ణాటకలో మహమ్మారి పంజా విసురుతోంది. గురువారం ఒక్కరోజే 47,754 మందికి సోకింది వైరస్. ఈ ధాటికి మరో 29 మంది మరణించారు. 22,143 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 18.48శాతంగా నమోదైంది.