దీపకు ఊహించని షాక్.. విభేదించిన భర్త.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు
జయలలిత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆమె మేనకోడలు దీపకు ఆమె భర్త మాధవన్ నుంచి ఊహించని షాక్ ఎదురైంది.
చెన్నై: జయలలిత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆమె మేనకోడలు దీపకు ఆమె భర్త మాధవన్ నుంచి ఊహించని షాక్ ఎదురైంది. జయలలిత మరణం తరువాత దీప 'ఎంజీఆర్ అమ్మ దీప పెరవై' పేరుతో ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో దీప భర్త మాధవన్ ఆమెతో విభేదించారు. సదరు పొలిటికల్ ఫోరంలో తాను కొనసాగనని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం జయలలిత సమాధి వద్దకు వెళ్లి, శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మాధవన్ మాట్లాడుతూ తానొక కొత్త పార్టీ నెలకొల్పబోతున్నట్లు ప్రకటించాడు. దీపను కొన్ని దుష్ట శక్తులు ప్రభావితం చేస్తున్నాయని, వారి విధానాలు నచ్చకే తను దీప స్థాపించిన రాజకీయ వేదిక నుంచి వైదొలగుతున్నట్లు మాధవన్ తెలిపాడు.

మరోవైపు దీప ఇప్పటికే తాను ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యలో తన భర్త నుంచే ఇలా ఎదురుదెబ్బ తగలడంతో ఆమె డైలమాలో పడ్డారు. ఫిబ్రవరి 24న దీప ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. జయలలిత పుట్టిన రోజు నాడు ఆమె ఈ ప్రకటన చేశారు.
అయితే అనంతరం జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆమె పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆమె ఆ వర్గానికి కూడా దూరంగానే ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలన్నీ శశికళ వర్గం చెప్పుచేతల్లో ఉండడంతో.. ఎలాగైనా దీప ఆ పార్టీని దక్కించుకోవాలని, ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలిచి జయలలితకు నిజమైన రాజకీయ వారసురాలిగా నిరూపించుకోవాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications