అయిదేళ్లలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్: మనకు తెలిసినవి రెండే: ఆ ఒక్కటీ అడగొద్దు
మంగళూరు: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్ల కాలంలో మనదేశ వైమానిక దళం మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందట. సరిహద్దులను దాటుకుని, పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి.. ఉగ్రవాదుల నడ్డి విరిచిందట. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
ఈ మూడింట్లో మనకు తెలిసినవి రెండే. ఒకటి- 2016లో జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ సమీపంలో సరిహద్దులకు అవతల చోటు చేసుకున్న వైమానిక దాడులు. రెండోది- ఇటీవలే పాకిస్తాన్ భూభాగంపైన ఉన్న బాలాకోట్ సమీపంలో జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై నిర్వహించినది. మరి.. మూడోది!. ఎవరికీ తెలియదు. దానికి సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా బయటికి రాలేదు.
ఆ ఒక్కటీ అడగొద్దు..
మూడో సర్జికల్ స్ట్రైక్స్ నకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి రాజ్ నాథ్ సింగ్ సిద్ధంగా లేరు. దీని గురించి ప్రశ్నించిన వారికి ఆ ఒక్కటీ అడగొద్దు.. అంటూ ఆయన సమాధానాన్ని దాటవేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రాజ్ నాథ్ సింగ్ కర్ణాటకలోని మంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ కార్యకర్తలు, పదాధికారులతో సమావేశం అయ్యారు. పార్టీ గెలుపోటములపై చర్చించారు. 2014 నాటి కంటే ఎక్కువ సీట్లను సాధించుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.
కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉండగా.. 2014 ఎన్నికల్లో కమలనాథులు 17 సీట్లలో తమ కాషాయ జెండా ఎగురవేశారు. తిరుగులేని మెజారిటీని సాధించారు. మిగిలిన వాటిల్లో కాంగ్రెస్ 11, జనతాదళ్ (సెక్యులర్) రెండు స్థానాలను దక్కించుకోగలిగాయి. ఈ సారి ఎన్నికల్లో కనీసం 20 నుంచి 23 స్థానాలపై బీజేపీ కన్నేసింది. దీనికి అనుగుణంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. వారికి దిశా నిర్దేశం చేశారు. కేంద్రం అమలు చేస్తోన్న సంక్షేమ పథకానలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వ లోపాలు, తప్పులపై ఎప్పటికప్పుడు ఎండగట్టాలని అన్నారు. దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజీపడబోమని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
మూడోది కూడా వైమానిక దాడులే
దాయాది దేశం పాకిస్తాన్ పై ఈ అయిదేళ్ల కాలంలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రకటించారు. తమ దేశ జవాన్లు మూడుసార్లు పాకిస్తాన్ భూభాగంపైకి ప్రవేశించి, ఉగ్రవాదులను విజయవంతంగా మట్టుబెట్టారని చెప్పారు. మూడో సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించిన వివరాలను తాను బహిర్గతం చేయలేనని అన్నారు. యూరీ సెక్టార్, బాలాకోట్ పై వైమానిక దాడులపై తాను మరిన్ని వివరాలను ఇవ్వగలుగుతానే గానీ.. ఇంకో సర్జికల్ స్ట్రైక్ గురించి ఏమీ చెప్పలేనని, అది కూడా వైమానిక దాడులేనని ఆయన స్పష్టం చేశారు. దేశ రక్షణ విషయంలో భారత్ బలహీనం కాదనే విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని సూచించారు.