జయలలిత కాళ్లు తొలగించలేదు: క్లారిటీ ఇచ్చిన కారు డ్రైవర్, శశికళ ఏం చేశారు, డీజీపీ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కాళ్లను తొలగించారు అనే ఆరోపణలపై ఆమె కారు డ్రైవరు అయ్యప్పన్ మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమీషన్ ముందు హాజరైనారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాను మూడుసార్లు చూశానని కారు డ్రైవర్ అయ్యప్ప్ ఆర్ముగస్వామి విచారణ కమీషన్ కు వివరించారు. 1991 నుంచి అయ్యప్పన్ జయలలిత కారు డ్రైవర్ గా పని చేశారు.
కాళ్లు తొలగించారా !
జయలలిత మృతిపై పలు అనుమానాలు తెరపైకి వచ్చినట్టే ఆమె కాళ్లను తొలగించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే అపోలో ఆస్పత్రి యాజమాన్యం దీన్ని ఖండించింది. ఈ నేపథ్యంలో జయలలిత మృతిపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సమక్షంలో జయలలిత కారుడ్రైవరు అయ్యప్పన్ హాజరయ్యారు.
జయలలితకు ఇబ్బంది
విచారణ కమీషన్ ముందు వివరణ ఇచ్చిన అనంతరం అయ్యప్పన్ మీడియాతో మాట్లాడారు. 2016 సెప్టెంబర్ 21వ తేదీ జయలలిత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అయితే ఆ రోజు ఆమె మానసికంగా చాల ఇబ్బందిపడ్డారని ఆమె కారు డ్రైవర్ అయ్యప్పన్ సమాచారం ఇచ్చారు. అదే రోజు ఆసుపత్రిలో చేరాలని డాక్టర్ శివకుమార్ సూచించడంతో జయలలిత నిరాకరించారని అయ్యప్పన్ అన్నారు.
అర్దరాత్రి సమాచారం
2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్దరాత్రి జయలలితను ఆసుపత్రిలో చేర్చామని తమకు సమాచారం ఇచ్చారని, వెంటనే తాను అపోలో ఆసుపత్రికి వెళ్లి అమ్మను చూశానని అయ్యప్పన్ అన్నారు. జయలలిత అపస్మారకస్థితిలోనే అపోలో ఆసుపత్రిలో చేరారని అయ్యప్పన్ స్పష్టం చేశారు.
కాళ్లు తొలగించారా !
జయలలితకు కాళ్లు తొలగించారు అని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జయలలితకు కాళ్ల తొలగించలేదని ఆమె కారు డ్రైవర్ అయ్యప్పన్ స్పష్టం చేశారు. జయలలిత మరణించిన తరువాత ఆమె కాళ్లకు తానే తాడు కట్టానని, ఆసమయంలో డీఎస్పీ కరుప్పస్వామి అక్కడే ఉన్నారని అయ్యప్పన్ చెప్పారు.
శశికళ ఏం చేశారు !
జయలలితను చిన్నమ్మ శశికళ చివరి నిమిషం వరకూ కంటికి రెప్పలాకాపాడుకుంటూ వచ్చారని అయ్యప్పన్ చెప్పారు. జయలలిత విషయంలో శశికళ ఏ రోజూ నిర్లక్షం చేసినట్లు తాను చూడలేదని, ఆమె మీద తనకు ఎలాంటి అనుమానం లేదని అయ్యప్పన్ అన్నారు.
అక్కడే ఉన్నారు
2016 సెప్టెంబర్ 22వ తేదీ అర్దరాత్రి తాను అపోలో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో అక్కడ చిన్నమ్మ శశికళతో పాటు అప్పటి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావ్, జయలలిత సెక్యూరిటీ అధికారి వీరపెరుమాల్, డీజీపీ రాజేంద్రన్, అమ్మ వ్యక్తిగత కార్యదర్శి పెనగుండ్రన్ అక్కడే ఉన్నారని కారు డ్రైవర్ అయ్యప్పన్ చెప్పారు.
పన్నీర్ సెల్వం
జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రికి వచ్చి జయలలిత ఆరోగ్యం గురించి ఆరాతీసేవారని కారు డ్రైవర్ అయ్యప్పన్ మీడియాకు చెప్పారు. జయలలిత కారు డ్రైవర్ అయ్యప్పన్ చెప్పిన విషయాలను జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమీషన్ రికార్డు చేసుకుంది.