టీవీకి ఇంటర్వూ: రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు, యువరాజుకు బీజేపీ దెబ్బ!
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల తుది విడత పోలింగ్ జరుగనుండగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఫిర్యాదు చెయ్యడంతో ఈసీ నోటీసులు జారీ చేసింది.
నోటీసులకు డిసెంబర్ 18వ తేదివ సాయంత్రం ఐదు గంటలలోపు వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ సూచించింది. డిసెంబర్ 14వ తేదీ గుజరాత్ రెండోదశ పోలింగ్ జరగునున్న నేపథ్యలో ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రానికి తెర పడింది.
డిసెంబర్ 13వ తేదీ బుధవారం రాహుల్ గాంధీ పలు టీవీ చానల్స్ కు ఇంటర్వూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూలలో గుజరాత్ ఎన్నికల గురించి రాహుల్ గాంధీ మాట్లాడారని, టీవీ చానల్స్ ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం చేశారని బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీవీ చానల్స్ క్లిప్పింగ్స్ పరిశీలించిన భారత ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యింది.