ఎలక్షన్ ఎఫెక్ట్ : ఏటీఎంలో రాని, చెలామణిలోలేని రూ.2 వేల నోటు
హైదరాబాద్/ అమరావతి : రూ.2 వేల నోటుకు ఏమైంది. ఏటీఎంలలో రావడం లేదు. చెలామణిలో కూడా లేదు. ఏటీఎంలో వంద, రెండు వందలు, ఐదొందల నోట్లు వస్తున్నాయి. రూ.2 వేల నోట్లు కనిపించడం లేదు. బ్యాంకుల్లో కూడా పెద్ద నోట్లు ఇవ్వమని అడిగితే లేవని చెప్తున్నారు సిబ్బంది. నగదు కొరతకు ప్రధాన కారణం ఎన్నికలేనని తెలుస్తోంది. ఈ వాదనతో ఇటు ఖాతాదారులు అటు బ్యాంకర్లు ఏకీభవిస్తున్నారు.
ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం తక్కువే .. కారణమిదీ ?
ఓట్ల కోసం కోట్లు దాచారు ..
దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ వచ్చేసింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఉండగా .. ఏపీలో లోక్ సభతోపాటు అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ గడువు ముగుస్తోన్నందున ముందుజాగ్రత్త పడ్డ నేతలు పెద్ద నోట్లను ఎక్కడికక్కడ బ్లాక్ చేశారు. తమ అనుచరుల ద్వారా ఆరునెలల కిందటి నుంచే పెద్ద నోట్ల బ్లాక్ ప్రక్రియ చేపట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఏటీఎంలో రూ.500 నోట్లే ..
ఏటీఎంలో రూ.500 నోట్లే వస్తున్నాయి. ఇదివరకు రూ.2 వేల నోటు వచ్చేది. ఎందుకు ఇలా వస్తుందో తెలియడం లేదని మరో బ్యాంకు అధికారి చెప్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా వచ్చే మొత్తాన్ని కొందరు లబ్ధిదారులు పెద్దనోట్లుగా మార్చుకుంటున్నారని బ్యాంకు అధికారులు వివరిస్తున్నారు.
చిల్లర తిప్పలు తప్పాయి
ఏటీఎంలో రూ.2 వేల నోట్లు రావడం లేదని ఆందోళన నెలకొంటే .. చిరుద్యోగులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.2 వేల నోటు వచ్చేది. బయటకొచ్చి చిల్లర మార్చడానికి తలప్రాణం తోకకువచ్చేది. ఇప్పుడు రూ.500 నోట్లే వస్తున్నందున ఇబ్బంది లేదని పేర్కొంటున్నారు.
సెప్టెంబర్ వరకు రూ.2 వేల నోటు చెలామణి
గతేడాది మార్చి వరకు దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం 18.03 లక్షల కోట్ల నగదులో 37.3 శాతం రూ.2 వేల నోట్లు ఉండేవని .. 43 శాతానికి పైగా రూ.500 నోట్లు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్ వరకు రూ.2 వేల నోట్లు చెలామణి బాగానే ఉండేదని .. ఆ తర్వాతే తగ్గిపోయాయన అధికారులు చెప్తున్నారు.