నీట్ విద్యార్థిని లోదుస్తులు విప్పించిన ఘటన: నిజ నిర్ధారణ కమిటీ: రిపోర్ట్
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ సందర్భంగా కేరళలోని కొల్లంలో చోటు చేసుకున్న ఉదంతం.. మరింత దుమారం రేపుతోంది. కొల్లం పరీక్షా కేంద్రం సిబ్బంది విద్యార్థినుల పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై బాధిత విద్యార్థినుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు సైతం నమోదైంది. ఈ ఘటనలో అయిదుమంది అరెస్ట్ అయ్యారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
నీట్ పరీక్షకు హాజరయ్యే సమయంలో లోదుస్తులు విప్పించడంతో పాటు పరీక్షా హాల్లోకి చున్నీతో వెళ్లడానికీ అనుమతి ఇవ్వలేదు అక్కడి సిబ్బంది. సిబ్బందికి వ్యతిరేకంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పొందుపరిచారు. చున్నీ లేకపోవడం వల్ల తల వెంట్రుకలతోనే తమ ఎద భాగాన్ని కప్పుకోవాల్సి వచ్చిందంటూ బాధిత విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు.
అబ్బాయిలతో కలిసి పరీక్షను రాయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయిదుమంది మహిళా సిబ్బందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబ్బంది. మరో ఇద్దరు స్థానిక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన పరీక్షా కేంద్రం ఉద్యోగులు ఉన్నారు.
కాగా ఈ వ్యవహారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్, తిరువనంతపురంలోని సరస్వతి విద్యాలయ అరప్పుర వట్టియూర్కవు ప్రిన్సిపల్ శైలజ, ఎర్నాకుళంలోని పెరుంబవూర్ ప్రగతి అకాడమీ చీఫ్ సుచిత్ర శైజిత్ను ఈ నిజనిర్ధారణ కమిటీలో నియమించింది. నాలుగు వారల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.