డిజిటల్ ఇండియా : డ్రోన్ల కోసం రూ.వెయ్యి కోట్లు, ఎందుకో తెలుసా ...?
న్యూఢిల్లీ : డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్ల వ్యయం చేయాలని నిర్ణయానికి వచ్చింది. డ్రోన్ల సేవలతో దేశాన్ని డిజిటల్గా మార్చుకోవచ్చని అంచనా వేసింది. టోపోగ్రాఫిక్స్ డేటా బేస్ రూపొందించడానికి ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నట్టు పేర్కొన్నది. దీంతో సంబంధించిన విషయం గురించి త్వరితగతిన తెలుసుకునే వెసులుబాటు దక్కుతుందని భావిస్తోంది.
దేశంలో డిజిటల్ మ్యాప్తో భూముల వివరాలు త్వరితగతిన తెలుసుకునే వీలుందని భావిస్తున్నారు. సామాజిక, ఆర్థిక డేటా, రోడ్ నెట్వర్క్తోపాటు వివిధ రికార్డులు ఉంటాయని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఐఐఎస్లో మీడియాకు వివరించారు. ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో ఇప్పటికే ఈ విధానం ప్రారంభించామని పేర్కొన్నది. తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని .. అయితే అందుకు సంబంధిత ప్రభుత్వం ఆసక్తి కనబరచాలని పేర్కొన్నది. డ్రోన్లలో అధిక రిజల్యూషన్ 3 డీ మ్యాప్తో రూపొందిస్తారు.