కేరళలో వర్ష బీభత్సం: ఆ ఐదు జిల్లాలలో రెడ్ అలెర్ట్; అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ !!
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్టోబర్ 16 తెల్లవారుజాము నుండి కేరళలో భారీ వర్షం కురుస్తోంది, దీని వలన అనేక జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కేరళలోని ఐదు జిల్లాల్లో ఈరోజు "భారీ నుండి అత్యంత భారీ" వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ ఐదు జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్
పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జనజీవనం అతలాకుతలం అవుతుంది.
ఏడు జిల్లాలలో ఆరెంజ్ అలెర్ట్
"కేరళ తీరంలో ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడనం ప్రభావంతో, రాష్ట్రంలో అక్టోబర్ 17 (ఆదివారం) ఉదయం వరకు చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18 వ తేదీ (సోమవారం) మరియు 19 వ తేదీ (మంగళవారం) నుండి వర్షపాతం తగ్గే అవకాశం ఉంది అని వాతావరణ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాలలో, వాతావరణ శాఖ కార్యాలయం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది, ఈ జిల్లాలలో భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచిస్తుంది.
ప్రజలకు సూచనలు చేసిన ప్రభుత్వం
తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, మరియు కోజికోడ్ లు ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా వయనాడ్ మరియు కన్నూర్ ఎల్లో అలర్ట్లో ఉన్నాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాలలోఆరెంజ్ అలర్ట్" ప్రకటించిన, వాతావరణ శాఖ ఐదు జిల్లాలలో రెడ్ అలెర్ట్ గా ప్రకటించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది . భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పర్వతాల సమీపంలో, నదుల సమీపంలో నివసించేవారు అలెర్ట్ గా ఉండాలని సూచించారు.
అనవసర ప్రయాణాలు విరమించుకోవాలని సూచన
తిరువనంతపురం జిల్లా యంత్రాంగం అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. దక్షిణ జిల్లాలోని నెయ్యార్ డ్యామ్ యొక్క నాలుగు గేట్లను ఇప్పటికే ఒక్కొక్కటి 40 సెం.మీ మేర ఎత్తినట్టు జిల్లా కలెక్టర్ నవజ్యోత్ ఖోసా తెలిపారు. తిరువనంతపురం మరియు కొచ్చి నగరాలు మరియు కుట్టనాడ్ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమైనట్టు తెలుస్తుంది. అక్టోబర్ 15 న ఇడుక్కి జలాశయంలో నీటి మట్టం బ్లూ అలర్ట్ మార్క్ దాటింది. అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అక్టోబర్ 17 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
అరేబియాలో అల్పపీడనం ఎఫెక్ట్ .. ఏపీ, తెలంగాణా, ఒడిశాలకు వర్షాలు
అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళ రాష్ట్రంలోనే కాదు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఒడిస్సా ప్రభుత్వం తమ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.