అగ్ని-1 మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించిన ఆర్మీ
బాలసోర్: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన షార్ట్ రేంజ్ అగ్ని-1 బాలిస్టిక్ మిస్సైల్(ఎస్ఆర్బీఎం)ను మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలసోర్లో ఉన్న అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు.
భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఈ క్షిపణి పరీక్షను చేపట్టింది. అగ్ని-1 బాలిస్టిక్ మిస్సైల్ సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. అగ్ని-1లో ఇది 18వ వెర్షన్ కావడం విశేషం.
15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 సుమారు 12 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు వెయ్యి కిలోల పేలోడును మోసుకెళ్లగలదు. ఇదే బేస్ నుంచి రెండు వారాల క్రితం లాంగ్ రేంజ్ అగ్ని-5 మిస్సైల్(ఐసీబీఎం)ను కూడా ఆర్మీ అధికారులు పరీక్షించారు.
పరీక్ష అనంతరం నిర్ణీత సమయంలోనే క్షిపణి లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మిస్సైల్ను 2004లో భారత సైన్యం వాడుకలోకి తీసుకువచ్చారు. సైనిక దళాల రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా ఈ మిస్సైల్ను పరీక్షించారు.
లక్ష్యాన్ని అత్యంత పకడ్బందీగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 మిస్సైల్లో ఉందని, అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఈ మిస్సైల్ను ప్రయోగించవచ్చని ఆర్మీ అధికారులు తెలిపారు. రేంజ్, ఆక్యురెసీలో అగ్ని -1 మిస్సైల్ అత్యుత్తమ ప్రదర్శన జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.