ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ప్రయోగం ఫెయిల్: ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉదయం ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లి ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. ఈఓఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో కాక అస్థిరకక్ష్యలో ప్రవేశపెట్టింది.
రాకెట్ ప్రయోగం విఫలమైందని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ ఉపగ్రహాల వల్ల ఇక ఎంతమాత్రం ఉపయోగం లేదని ఇస్రో స్పష్టం చేసింది. ప్రయోగం అంచనాలను అందుకోలేకపోయిందని వెల్లడించింది. దీనికి కారణం ఓ సెన్సార్ పనితీరులో లోపమేనని ఇస్రో తెలిపింది. ఉపగ్రహాలు తప్పుడు కక్ష్యలో ప్రవేశించాయని పేర్కొంది.

దీనికి సంబంధించి ఓ కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ సిఫారసుల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ఇస్రో వివరించింది. ఉదయం 9.18 గంటలకు రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లగా, ఎంతకీ డేటా అందకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైందన్న అనుమానాలు కలిగాయి. డేటా ప్రసారానికి అంతరాయం కలిగిందని, కొన్ని గంటల తర్వాత ప్రయోగం విజయవంతం అయిందా, లేదా అనే అంశంపై ప్రకటన చేస్తామని వెల్లడించింది. అందరినీ నిరాశకు గురిచేస్తూ ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమైందని ఇస్రో ప్రకటన చేసింది.
రాకెట్ ద్వారా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు నిరుపయోగంగా ఉంటాయని ఇస్రో తెలిపింది. ప్రయోగంలో భాగంగా మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్నప్పటికీ, టర్మినల్ దశలో రాకెట్ అదుపుతప్పింది. రెండు ఉపగ్రహాలను 356 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, వాటిని 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. ఇకపై ఈ ఉపగ్రహాలు పని చేయవని, సెన్సర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపింది.












Click it and Unblock the Notifications