సంస్కరణ ప్రభావం సానుకూలమే: ఆర్థిక మంత్రి జైట్లీ భరోసా
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్మాణాత్మక సంస్కరణల ప్రభావం సానుకూలంగా ఉందని, దీనివల్ల మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. సామాన్యుడి జీవనం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్మాణాత్మక సంస్కరణల ప్రభావం సానుకూలంగా ఉందని, దీనివల్ల మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్యుడి జీవనం మెరుగుపడుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, స్వయం సమృద్ధి పెరుగుతోందని, కరెంట్ అకౌంట్ లోటు 2 శాతం కన్నా తక్కువతో సురక్షిత స్థాయిలో ఉందని జైట్లీ వెల్లడించారు.
భారతదేశంపై అంతర్జాతీయ నమ్మకం పెరిగిందన్నారు. అలాగే ఫారెక్స్ నిల్వలు కూడా అత్యధికంగా 400 బిలియన్ డాలర్లకు చేరాయని చెప్పారు. ద్రవ్య ఏకీకరణ నెమ్మదిగా 3 శాతం స్థాయికి చేరుతోందని, జీడీపీ వేగం పుంజుకుంటుందని వివరించారు.
జీఎస్టీ వల్ల అవినీతి తగ్గిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.72,500 కోట్లు కాగా ఆ లక్ష్యం దిశగా చురుగ్గా ముందుకెళ్తున్నామని, ఆర్థిక వ్యవస్థ అత్యధికంగా వృద్ధి చెందేలా కృషి చేయడంపై దృష్టి పెట్టామని చెప్పారు.
భాగస్వాములందరితో సంప్రదింపులు జరుపుతామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. వృద్ధి వేగం నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
మూడేళ్ల నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని చెప్పారు. గత కొద్ది వారాల్లో ఆర్థిక వ్యవస్థపై చాలా చర్చలు, సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ నల్లధనంపై పోరాటంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు భారీ సంస్కరణలని చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా మాట్లాడుతూ భారత్మాల కార్యక్రమంలో భాగంగా 34,800 కి.మీ. మేరకు రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
జీఎస్టీ వసూళ్లు రూ.92,150 కోట్లు...
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద సెప్టెంబర్ మాసంలో రూ.92.150 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు ప్రకటించింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీకి రూ.14,042 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి 21,172 కోట్లు వచ్చాయి.
సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.48,948 కోట్లుగా ఉంది. ఇందులో రూ.23,951 కోట్లు దిగుమతులకు సంబంధించినవని ఆర్థిక శాఖ తెలిపింది. పరిహార సుకం రూ.7.988 కోట్లు అని, ఇందులో రూ.722 కోట్లు దిగుమతులకు సంబంధించిన పరిహార సుంకమని తెలిపింది.
సెప్టెంబర్ మాసానికి సోమవారం వరకూ 42.91 లక్షల వ్యాపార సంస్థలు ఇనీషియల్ జీఎస్టీఆర్-3బీ రిటర్స్స్ దాఖలు చేసినట్టు పేర్కొంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం జీఎస్టీ ప్రవేశపెట్టిన తొలిమాసం జూలైలో జీఎస్టీ వసూళ్లు రూ.95,000 కోట్లు కాగా, ఆగస్టులో అది రూ.91,000 కోట్లుగా ఉంది.