జమ్మూ కాశ్మీర్ టార్గెట్ కిల్లింగ్స్: మైనారిటీ వర్గాల సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జమ్మూ కాశ్మీర్లో గత నెల రోజులుగా జరుగుతున్న హిందువుల లక్ష్య హత్యల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ లో ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన నెలకొంది. లోయలో కాశ్మీరీ పండిట్ లతో పాటు, జమ్మూకాశ్మీర్ లో మైనార్టీలు గా ఉన్న హిందువుల లక్ష్య హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. జమ్మూకాశ్మీర్లో తలెత్తిన సమస్యలను హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు .
ఇక జమ్మూ కాశ్మీర్ లోయలో ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న హత్యలతో, జమ్మూ కాశ్మీర్లోని పరిపాలన కాశ్మీరీ పండిట్లతో సహా మైనారిటీ హిందూ కమ్యూనిటీలకు చెందిన ఉద్యోగులందరినీ లోయలోని "సురక్షిత ప్రదేశాలకు" తరలించడం ప్రారంభించామని పేర్కొన్నారు. న్యూ ఢిల్లీలో శుక్రవారం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, NSA అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, R&AW చీఫ్ సమంత్ గోయెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ అరవింద్ కుమార్ మరియు సీనియర్ అధికారులతో భద్రతా పరిస్థితిని సమీక్షించారు.

దాదాపు గంటన్నరకు పైగా జరిగిన సమావేశంలో మైనారిటీ కమ్యూనిటీ ఉద్యోగులను కాశ్మీర్ నుండి జమ్మూకి బదిలీ చేయాలనే డిమాండ్లను తాము అంగీకరించబోమని జమ్మూ కాశ్మీర్ పరిపాలన వర్గాలు తెలిపాయి. లోయను విడిచిపెట్టే వ్యక్తులకు పరిపాలన మద్దతు ఇవ్వదని వారన్నారు. వారందిరినీ జమ్మూకి పోస్ట్ చెయ్యటం కుదరదని వెల్లడించారు. అయితే లోయలోనే సురక్షిత ప్రాంతాలకు వారికి పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు. అలాగే హత్యలను నియంత్రిస్తామని, ఎవరూ భయాందోళన చెందవద్దని వారు చెప్తున్నారు.

2015లో జమ్మూ కాశ్మీర్ కోసం ప్రధానమంత్రి డెవలప్మెంట్ ప్యాకేజీ కింద రిక్రూట్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులంతా ఇప్పుడు సురక్షిత స్థానాలకు పోస్ట్ చేయబడ్డారు అని ఆ వర్గాలు తెలిపాయి. పీఎం ప్యాకేజీ కింద దాదాపు 6,000 మందిని నియమించారు. వారిలో 5,500 మందికి పైగా పోస్ట్ చేయబడ్డారు. అంతేకాకుండా, దాదాపు 10,000 మంది మైనారిటీ (ముస్లిమేతర) ఉద్యోగులు కూడా సురక్షిత స్థానాలకు పంపబడ్డారని ఆ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications