లాలూ టు జయ: రూ.కోట్లు కొట్టేసి జైలుకు సీఎంలు!
న్యూఢిల్లీ: అక్రమార్కుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు ఊచలు లెక్కపెడుతున్న విషయం తెలిసిందే. అధికారాన్ని దుర్వినియోగం చేసి, కటకటాలపాలైన ముఖ్యమంత్రులు పలువురు ఉన్నారు. కొందరు ఇతర కేసుల్లోను జైలుకెళ్లారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన తొలి మహిళా సీఎం జయలలిత.
జైలుపాలైన మాజీ ముఖ్యమంత్రులలో జయలలిత, కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్, శిబూ సోరెన్, జగన్నాథ్ మిశ్రా, ఓం ప్రకాశ్ చౌతాలా, మధుకొడా తదితరులు ఉన్నారు.
జయలలిత
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత రూ.66.5 కోట్ల కేసులో జైలుకు వెళ్లారు. ఆమెకు కోర్టు వంద కోట్ల జరిమానా విధించింది.
కరుణానిధి
జయలలిత రాజకీయ ప్రత్యర్థి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కూడా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన కాళ్లకుడి ఆందోళనలో పాల్గొన్న కరుణానిధిని అరెస్టు చేసిన పోలీసులు మూణ్ణెళ్లు జైలులో ఉంచారు.
లాలూ ప్రసాద్ యాదవ్
సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో న్యాయస్థానం ఆర్జేడీ అధ్యక్షులు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో లాలూ కీలక నిందితుడు. కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని తన భార్య రబ్రీదేవికి అప్పగించారు. జైలు నుండే రాష్ట్రాన్ని పాలించారన్న ఆరోపణలు ఉన్నాయి. దాణా కుంభకోణంలో లాలూతో పాటు బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాకు కూడా పాత్ర ఉందని కోర్టు తేల్చింది.
శిబూ సోరెన్
శిబూ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేశారు. వ్యక్తిగత కార్యదర్శి హత్యలో హత్యానేరం కింద జీవిత ఖైదును ఎదుర్కొన్నారు. 1994లో హత్య జరగగా, 2006లో ఢిల్లీ కోర్టు సోరెన్ను దోషిగా తేల్చింది. అయితే, ఆయన హైకోర్టుకు వెళ్లారు. కిందికోర్టు తీర్పును కొట్టివేసింది.
ఓం ప్రకాశ్ చౌతాలా
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టి కేసుల్లో ఇరుక్కున్నారు. అతనికి కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. ప్రస్తుతం అతను బెయిల్ పైన బయట ఉన్నారు.
మధుకొడా
మధుకొడా అవినీతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మనీ లాండరింగ్, గనుల కుంభకోణం తదితర అక్రమాలకు పాల్పడిన కొడాను సీబీఐ అరెస్టు చేసింది. అతను మూడేళ్ల దాకా జైలు జీవితం గడిపాడు. అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చాడు. కేసు విచారణ పూర్తి కావాల్సి ఉంది.