అంతర్జాతీయ స్ధాయికి భారత్ లో హిజాబ్ వివాదం-స్పందిస్తున్న దేశాలు-భారత్ అభ్యంతరం
కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం జాతీయ స్ధాయికి పాకకుండా చూడాలని సుప్రీంకోర్టు తాజాగా పిటిషనర్లకు సూచించింది. అయితే అప్పటికే ఇది అంతర్జాతీయ స్ధాయికి కూడా వెళ్లిపోయింది. ఇప్పుడు దీనిపై యూఎస్ సహా పలు దేశాలు స్పందిస్తుండటంతో కేంద్రం ఇరుకునపడుతోంది. దీంతో భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ విదేశాంగశాఖ ఆయా దేశాలకు సుతిమెత్తగా హెచ్చరికలు చేస్తోంది.
Recommended Video
అంతర్జాతీయ స్ధాయికి హిజాబ్ వివాదం
భారత్ లోని కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు అంతర్జాతీయంగా పాకింది. కర్నాటకలో యువతులు విద్యాసంస్ధల్లో హిజాబ్ ధరించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీజేపీ అనుబంధ హిందూ సంస్ధల ప్రోద్భలంతో విద్యార్ధులు కాషాయ కండువాలు ధరించడం, హిజాబ్ ధరించిన యువతికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం వంటి అంశాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. పరమత సహనానికి ప్రతీకగా భావించే భారత్ లో ఇలాంటి చర్యలు చోటు చేసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం ఇప్పుడు నిశితంగా గమనిస్తోంది.
యూఎస్ స్పందన
కర్నాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై యుఎస్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (ఐఆర్ఎఫ్) స్పందిస్తూ, హిజాబ్ నిషేధం "మతపరమైన స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని, మహిళలు, బాలికలకు ఇబ్బందులు కలిగిస్తుందని, వారిని తక్కువ చేస్తుందని పేర్కొంది.
యూఎస్ రాయబారి రషద్ హుస్సేన్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో, "మతపరమైన స్వేచ్ఛ అనేది ఒకరి మతపరమైన దుస్తులను ఎంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది" అని అన్నారు, కర్నాటక మతపరమైన దుస్తులకు అనుమతిని నిర్ణయించకూడదని ఆయన హితవు పలికారు.
కేంద్రం అభ్యంతరాలు
కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో విదేశాలు దీనిపై స్పందిస్తున్న తీరుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతర దేశాలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది, 'మా అంతర్గత సమస్యలపై ప్రేరేపిత వ్యాఖ్యలు స్వాగతించబోమని పేర్కొంది.
ఈ అంశం కర్ణాటక హైకోర్టు న్యాయ విచారణలో ఉందని విదేశాంగశాఖ వెల్లడించింది. తద్పారా భారత్ లోని కోర్టుల్లో ఉన్న వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. ఇప్పటికే ప్రధాని మోడీ ముస్లిం మహిళల స్వేచ్చను హరించేందుకు కొందరు కొత్తదారులు వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు.