ఉగ్రదాడి: బెంగళూరులో టెర్రరిస్టు అరెస్టు
బెంగళూరు: బెంగళూరు నగరంలో గుట్టుచప్పుడు కాకుండా తలదాచుకున్న నిషేదిత ఉగ్రవాద సంస్థ కమాండర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు, బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
నాగల్యాండ్ కు చెందిన అతోష్ చోపియ్ (27) అనే ఉగ్రవాదిని అరెస్టు చేశామని శనివారం ఎన్ఐఏ అధికారులు, బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇతని నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఎన్ఐఏ అధికారులు అన్నారు.
2015 మార్చి 26వ తేదిన కోహిమాలోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపంలో అస్సాం రైఫెల్స్ సైనికుల మీద ఉగ్ర దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అతోష్ చోపియ్ ప్రధాన నిందితుడు అని కేసులు నమోదు అయ్యాయి.
అతోష్ తో పాటు నలుగురు ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. అతోష్ నిషేదిత నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ (ఎన్ఎస్ సీఎన్ (కే)) కమాండర్ గా పని చేస్తున్నాడని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
కోహిమాలో దాడులు జరిగిన తరువాత అతోష్ మాయం అయ్యాడు. బెంగళూరు చేరుకుని ఎంజీ రోడ్డు సమీపంలోని ఓ లాడ్జ్ లో మకాం వేశాడు. అతని మీద ఎన్ఐఏ అధికారులు నిఘా వేశారు. అతోష్ బెంగళూరులో తలదాచుకున్నాడని వెలుగు చూసింది.
వెంటనే ఎన్ఐఏ అధికారులు బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు పోలీసుల సహకారంతో శుక్రవారం అతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర జరిగిన దాడిలో తాను పాల్గోన్నానని అతోష్ అంగీకరించాడు.
అతోష్ నేరం అంగీకరించడంతో అతనిని అరెస్టు చేశామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇతను ఎన్ఎస్ సీఎన్ (కే) ఉగ్రవాద సంస్థను బలోపేతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడని, పూర్తి వివరాలు బయటకు లాగుతున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.