కేఫ్ కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కేసు.. మంగళూరు సీపీపై వేటు
మంగళూరు : కేప్.. కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న మంగళూరు పోలీసు కమిషనర్ పరిధిలోని సీపీపై బదిలీ వేటు వేసింది. మంగళూరు సీపీ సందీప్ పాటిల్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో సిద్ధార్థ ఆత్మహత్య కేసు విచారణను సీరియస్గా తీసుకుంటున్నామనే సంకేతాలను ఇచ్చింది యడియూరప్ప ప్రభుత్వం.
సందీప్ పాటిల్ స్థానంలో మంగళూరు సీపీగా బెంగళూరు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ సుబ్రమణ్యేశ్వర రావుకు బాధ్యతలు అప్పగించింది. ఏడాదిలో మంగళూరు సీపీగా బాధ్యతలు చేపట్టబోతున్న సుబ్రమణ్యేశ్వర రావు మూడో వ్యక్తి. ఇదివరకు సందీప్ పాటిల్ .. అంతకుముందు టీ సురేశ్ మంగళూరు సీపీగా విధులు నిర్వర్తించారు. ఓ సిటీకి ఏడాదిలో ముగ్గురు కమిషనర్లను మార్చడం అంటే సాధారణ విషయమేమి కాదు. మంగళూరు సీపీగా పాటిల్ ఐదునెలలు పనిచేశారు. అంతకుముందు టీ సురేశ్ సీపీగా ఉన్నారు. పాటిల్తో పాటు డీసీపీ హనుమంతరాయను కూడా బదిలీ వేశారు. అతనిని దేవనగరి జిల్లాకు ఎస్పీ బాధ్యతలు అప్పగించారు.
అప్పులు, వేధింపులు తాళలేక నేత్రావతి నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వ్యాపారవేత్త ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్ కం టాక్స్ అధికారుల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నానని నోట్ రాయడంతో కలకలం రేగింది. దీనిపై విపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన సంగతి తెలిసిందే.