బాబుకి మోడీ ఫోన్: కుంగిన అపార్ట్మెంట్, ఎక్కడికక్కడే
న్యూఢిల్లీ/హైదరాబాద్: హుధుద్ తుఫాను నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. చంద్రబాబు ప్రధానికి తాజా పరిస్థితిని వివరించారు. సాయంత్రం తాను విశాఖకు వెళ్లి పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తానని చంద్రబాబు ప్రధానికి తెలిపారు.
హుధుద్ తుపానుపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో నరేంద్ర మోడీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో, ప్రసంగాన్ని ఆపి, మోడీతో చంద్రబాబు మాట్లాడారు. విశాఖ హెచ్చరికల కేంద్రానికి రాడార్తో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీకి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్లుప్తంగా వివరించారు. సహాయక చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం తాను విశాఖకు వెళుతున్నానని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
మోడీతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... తానే మోడీకి ఫోన్ చేద్దామనుకున్నానని, ఇంతలో ఆయనే ఫోన్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని మోడీ చెప్పారని, కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనే వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు.
తాను సాయంత్రం విశాఖకు వెళ్తున్నానని చెప్పారు. అవసరమైతే రెండు మూడు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. విశాఖలో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు అక్కడే ఉంటానని తెలిపారు.
పలు అపార్టుమెంట్లకు పగుళ్లు
హుధుద్ తుఫాను తీరాన్ని తాకడంతో శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులకు మందస మండలం వీరభద్ర గ్రామంలో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. 11 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో 20, డిమత్యలేశంలో 30 మర పడవలు, మరో 25 సాధారణ పడవలు కొట్టుకుపోయాయి. తీర ప్రాంత మండలాల్లో పెనుగాలులకు కొత్తపేట, తోటపాలెం, గ్రామాల్లో పలుచోట్ల విద్యత్ స్తంభాలు కూలిపోగా, ఏడు ఇళ్లు దెబ్బతిన్నాయి. మందస, రణస్థలం మండలాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. నేవీ, రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విశాఖలో సెల్ ఫోన్ సిగ్నల్స్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉత్తరాంధ్ర అతలాకుతలం
హుధుద్ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద తుఫాను తీరాన్న దాటింది. తీరం వెంట గంటకు 180 నుండి 200 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. మరో ఆరు గంటల పాటు ఎవరు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
విశాఖ నగరంలో హనుమంతవాకలో ఓ అపార్టుమెంటు నేలలో కుంగిపోయింది. పలు అపార్టుమెంట్లలో పగుళ్లు వచ్చాయి. నేవీ కమ్యునేకేషన్ వ్యవస్థ దెబ్బతింది. విశాఖ నగరంలో వందలాది కార్లు దెబ్బతిన్నాయి. ఫ్లెక్సీలు, హోర్డుంగులు కూలిపోయాయి. సెల్ ఫోన్ సిగ్నళ్లకు తవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్ల పైన చెట్లు కూలిపోయాయి.