మోడీ మాస్టర్ ప్లాన్: ఊహించని నిర్ణయం, రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడు!
కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి థావర్చంద్ గెహ్లట్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా రాష్ట్రపతి రేసులో అద్వానీ, మోహన్ భగవత్.. ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాము రేసులో లేమని ఆ నేతలు కొట్టిపారేయడంతో.. మరి కొత్త రాష్ట్రపతి ఎవరా? అన్న ఆసక్తి కొనసాగుతోంది. ఈ సంశయానికి తెరదించేలా కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి థావర్చంద్ గెహ్లట్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని తెలుస్తోంది.
థావర్ చంద్కే రాష్ట్రపతి పదవి కట్టబెట్టడం వెనుక బీజేపీకి స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో కొంతమంది హిందు మతోన్మాదులు దళితుల మీద తీవ్రమైన దాడులకు పాల్పడటం, దళిత మేదావి వర్గం అంతా యాంటీ హిందుగా ఉండటంతో బీజేపీ దళితులకు కాస్త దూరంగానే ఉన్న పరిస్థితి. దీంతో ఈ అంతరాలను చెరిపేసి దళితులకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో బీజేపీ దళిత రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతోంది.
ఈనెల 14న నాగ్పూర్ పర్యటన సందర్బంగా మోడీ ఈ ప్రతిపాదనపై ఒక అంచనాకు రానున్నారు. ఆరోజు అంబేడ్కర్ జయంతి కావడంతో నాగ్ పూర్ లోని అంబేడ్కర్ దీక్ష భూమిని సందర్శించి, అటు తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ఆయన భేటీ అవుతారు. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై మోడీకి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
కాగా, మోహన్ భగవత్ తో భేటీ కన్నా ముందు ఈనెల 10న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఢిల్లీలోని తన నివాసంలో మోడీ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్రమంత్రి మండలిలో మార్పులు చేర్పులపై చర్చించే అవకాశం ఉంది.