మాన్సూన్ అప్డేట్స్: రానున్న 5 రోజుల్లో అక్కడ భారీ వర్షాలు, ఏపీ-తెలంగాణలోను
Recommended Video
న్యూఢిల్లీ: రానున్న నాలుగైదు రోజుల్లో మధ్య భారత దేశం ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొంకణ్, గోవా, చత్తీస్గఢ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరామ్, త్రిపుర, తెలంగాణ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఒడిశా, పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బంగాళాఖాతం వరకు అల్పపీడనం కొనసాగుతోంది. ఈ కారణంగా రానున్న నాలుగైదు రోజుల్లో మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జూలై 13వ తేదీ వరకు ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలపై అల్పపీడన కొనసాగే అవకాశముంది. రానున్న ఐదు రోజుల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లోను భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో గుజరాత్ నుంచి కేరళ వరకు బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశముంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఒడిశా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమముందని చెప్పింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండ్రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీమ్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షాల తీవ్రత కారణంగా తెలంగాణ కేబినెట్ రద్దయింది.
ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో తీర ప్రాంతంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని ఆదివారం వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కాగా, నైరుతీ రుతుపవనాలు మే 29వ తేదీన కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాన్సూన్లో సెంట్రల్ ఇండియా సాధారణ వర్షపాతాన్ని, దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. ఉత్తర-తూర్పు భారతదేశంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కానుంది.
దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 90శాతం-96శాతం ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 96-104శాతం ఉంటే సాధారణం అని పరిగణిస్తారు. 90శాతం కంటే తక్కువగా ఉంటే తక్కువ వర్షపాతంగా తీసుకుంటారు. 104-110శాతం ఉంటే సాధారణం కంటే ఎక్కువ, 110శాతం కంటే ఎక్కువగా ఉంటే అత్యధిక వర్షపాతంగా తీసుకుంటారు.