సిక్కా సీఈఓగా పనికిరాడు: వెలుగులోకి మూర్తి ఈమెయిల్
ఇన్పోసిస్ నారాయణమూర్తి విశాల్ సిక్కాపై రాసిన మెయిల్ సంచలనంగా మారింది.సిక్కా రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆయన ఆ మెయిల్లో రాశాడు
బెంగుళూరు: ఇన్పోసిస్ సీఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్పోసిస్ పౌండర్ నారాయణమూర్తి రాసిన ఈ మెయిల్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
విశాల్ సిక్కా సీఈవోగా పనికిరారని తనతో బోర్డులోని ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు చెప్పినట్లు మూర్తి ఆ మెయిల్లో వెల్లడించారు. సీఈవో బదులు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పదవి అయితే ఆయనకు బాగా సూట్ అవుతుందని వాళ్లు తనతో చెప్పినట్లు ఆయన వివరించారు. ఆగస్ట్ 9న ఈ ఈమెయిల్ను నారాయణమూర్తి పంపారు.
కనీసం ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు విశాల్ సిక్కాపై ఫిర్యాదు చేశారు. అందులో రవి వెంకటేశన్ (కో చైర్మన్) కూడా ఉన్నారు. సిక్కా సీఈవోగా పనికిరారు.. సీటీవోగా అయితే ఓకే అని వాళ్లు నాతో చాలా సార్లు చెప్పారు. ఇది వాళ్లు అభిప్రాయమే తప్ప నాది కాదు. ఎందుకంటే నేను బోర్డు సభ్యుడిగా సిక్కా పనితీరును చూడలేదు అని ఈమెయిల్లో నారాయణ మూర్తి రాశారు.
అంతేకాదు సిక్కాతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఆయనతో కలిసి సమయం గడపడాన్ని తాను ఆస్వాదిస్తాననీ మూర్తి స్పష్టంచేశారు. సిక్కా వ్యూహాలు, వాటి అమలును ఎప్పుడూ తప్పుబట్టలేదని కూడా మూర్తి గుర్తుచేశారు. ఇన్ఫోసిస్ పాలనపైనే తనకు అభ్యంతరాలు ఉన్నాయని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. . ప్రస్తుతం ఉన్న బోర్డుతోనే సమస్య ఉంది. బోర్డు ఏమీ చేయలేని స్థితిలో కాకుండా మంచి పాలన చేసి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు అని మూర్తి అభిప్రాయపడ్డారు.