పఠాన్కోట్ హీరోలు: 6 బుల్లెట్లు దిగినా గంటసేపు పోరు
పఠాన్కోట్: పంజాబ్లోని పఠాన్కోట్ ఉగ్ర దాడి సమయంలో కమాండర్ శైలేష్ గురు శరీరంలో ఉగ్రవాదులు ఆరు బుల్లెట్లు దించారు. అయినప్పటికీ అతను ఉగ్రవాదుల పైన ఎదురుదాడికి దిగారు. కేతల్తో కలిసి దాదాపు గంట పాటు ఉగ్రవాదుల పైన ఆపరేషన్ నిర్వహించారు.
జనవరి 2వ తేదీన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పఠాన్కోట్ ఎయిర్ బేస్లోని ట్రాన్సుపోర్ట్ బేస్కు కొన్ని మీటర్ల దూరం వరకూ వచ్చిన నలుగురు ఉగ్రవాదులు ముందుకు కదులుతున్న సమయంలో వారిని మట్టుబెట్టేందుకు 12 మంది గరుడ కమెండోలు రంగంలోకి దిగారు.
ముందుగా ఇద్దరిద్దరు మూడు బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులు కదలకుండా నిలువరించారు. మరో 3 బృందాలు వెనుక నుంచి కాల్పులకు ఉపక్రమించాయి. ముందు వరుసలో కమెంటో గురుసేవక్ సింగ్, ఓ వింగ్ కమాండర్ తొలుత దాడి ప్రారంభించారు.
వారి వెనుక నుంచి కమెండోలు శైలేష్ గౌర్, కేతల్లు కాల్పులు ప్రారంభఇంచారు. గురుసేవక్ దేహంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. అయినా కాల్పులు ఆపలేదు. చివరికి ఆయన నేలకొరగడంతో శైలేష్, కేతల్లు ముందుకు కదిలారు.
ఉగ్రవాదుల నుంచి వచ్చిన ఆరు తూటాలు శైలేష్ పొత్తి కడుపులోకి దూసుకెళ్లాయి. అయినా శైలేష్ వెనుకడుగు వేయలేదు. కేతల్తో కలిసి ఏకంగా గంటసేపు పోరాడుతూ ముష్కరులను నిలువరించారు. దీంతో బిత్తరపోయిన ఉగ్రవాదులు మెకానికల్ ట్రాన్సుపోర్ట్ ఏరియా నుంచి వెనక్కి పారిపోయారు.
ఈ వీరోచిత ఎదురుదాడి కారణంగానే ఉగ్రవాదులు వాయుస్థావరంలో యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉన్న కీలక ప్రాంతంలో అడుగు పెట్టలేకపోయారు.
వాళ్లు అక్కడికి వెళ్లి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేది. 80 గంటలపాటు జరిగిన ఉగ్రవాదుల ఏరివేతలో ఏడుగురు సైనికులు అమరులయ్యారు. 20 మంది గాయాలపాలయ్యారు. శైలేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.