జమ్మూకశ్మీర్ నేతలతో భేటీ- మార్పుల్ని సమర్ధించుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీతో ఇవాళ జమ్ముకశ్మీర్కు చెందిన 14 మంది నేతలు సమావేశమయ్యారు. ఢిల్లీలోని లోక్కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని మోడీ అధికారిక నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో ఆయనతో పాటు హోంమంత్రి అమిత్షా, లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. ఈ భేటీలో ప్రధాని జమ్ముకశ్మీర్లో తీవ్రవాద నిర్మూలన, ప్రజాస్వామ్య స్ధాపన కోసం చేపట్టిన చర్యల్ని నేతల ముందు ఏకరువు పెట్టారు.
ప్రస్తుతం లెప్టినెంట్ గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్లో డీడీసీ ఎన్నికలు నిర్వహించామని, చరిత్రలో తొలిసారి బ్లాక్ స్ధాయి ఎన్నికలు జరిగాయని ప్రధాని మోడీ తెలిపారు. జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి బాటలు వేశామని ప్రధాని చెప్పుకొచ్చారు. పంచాయతీ, లోక్సభ ఎన్నికలను మించి డీడీసీ ఎన్నికల్లో 51 శాతం పోలింగ్ నమోదు కావడం ప్రజాస్వామ్య విజయమని ఆయన గుప్కర్ అలయన్స్ నేతలకు వివరించారు.

కశ్మీర్ ప్రాంతంలో పంచాయతీలకు రూ.3 వేల కోట్ల నిధులు ఇచ్చామని, తద్వారా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూశామని ప్రధాని తెలిపారు. ప్రధానితో భేటీలో పాల్గొంటున్న గుప్కర్ అలయన్స్ నేతలకు విడివిడిగా తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించారు. దీంతో జమ్ముకశ్మీర్ తాజా పరిణామాలు, భవిష్యత్తుపై తమ అభిప్రాయాల్ని వారు ప్రధానికి వివరిస్తున్నారు. ఇవన్నీ ముగిసిన తర్వాత ప్రధాని చివరిగా వారికి కేంద్రం అభిప్రాయాన్ని స్పష్టం చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications