Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ కూటమి వస్తే ఆటవిక రాజ్యమే: ప్రధాని మోడీ

పాట్నా: బీహార్‌లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ కూటమికి అధికారం కట్టబెడితే మళ్లీ ఆటవిక రాజ్యమే వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఆ కూటమిది రాజకీయ అవకాశవాదమని ఆరోపించారు. అయిదేళ్లపాటు పాలించే అవకాశాన్ని ఎన్డీఏ కూటమికి ఇచ్చినట్లయితే బీహార్‌ అంటే బిమారు(అస్వస్థత) అనే పేరును తొలగించి, అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

ఆదివారం గయలో బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అక్టోబరు-నవంబరుల్లో జరగబోయే ఎన్నికల ద్వారా అహంకారపూరిత ప్రభుత్వం నుంచి విముక్తి పొందే అవకాశం ప్రజలకు లభించబోతోందని మోడీ చెప్పారు. 40 నిమిషాల ప్రసంగంలో పదేపదే జంగిల్‌రాజ్‌ ప్రస్తావన తెస్తూ పరోక్షంగా లాలూప్రసాద్‌-రబ్రీదేవి పాలన గురించి చురకలు వేశారు.

ఆర్జేడీ, జేడీ(యు) మధ్యనున్న వైరుద్ధ్యాల కారణంగా మళ్లీ మునుపటి పాలనే వస్తుందని హెచ్చరించారు. 'జంగిల్‌రాజ్‌-పార్ట్‌ 2 వస్తే అంతా నాశనమే. పార్ట్‌-1లో కారాగార అనుభవం లేదు. ఇప్పుడు మాత్రం ఉంటుంది. కారాగారంలో ఉంటూ ఎవరూ మంచి విషయాలు నేర్చుకోలేరు...' అంటూ దాణా(గడ్డి) కుంభకోణంలో లాలూ జైలుపాలైన ఉదంతాన్ని ప్రస్తావించారు.

PM Narendra Modi declares war on Nitish

ఆ రెండు పార్టీలు రాజకీయ అవకాశవాదం కోసమే జత కట్టాయనీ, ఎన్నికల తర్వాత ఆ పొత్తు కొనసాగుతుందో లేదో అనుమానమేనని చెప్పారు. మతశక్తుల్ని ఓడించడానికి తాను విషాన్ని మింగడానికైనా సిద్ధమేనని లాలూ, గంధం చెట్లను పాములు చుట్టుకున్నా వాటి విషం మాత్రం చెట్లకు అంటదంటూ నితీశ్‌... తమ పొత్తు సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని మోడీ దెప్పిపొడిచారు.

'విషాన్ని మింగినవారు ఎన్నికల తర్వాత దానిని ఎవరి మొహాన కక్కుతారు? అది ఎక్కడ పడుతుంది? ప్రజల పళ్లెంలోనా? అలా చేయడాన్ని మీరు అంగీకరిస్తారా?' అని మోడీ ప్రశ్నించారు. 'బిహార్‌లో భుజంగ్‌ (లాలూ) ప్రసాద్‌ ఎవరో, చందన్‌ (నితీశ్‌) కుమార్‌ ఎవరో నాకు తెలియదు. విషాన్ని అందించిందెవరు? దానిని మింగిందెవరు? ఒకటి మాత్రం స్పష్టం.. ఎన్నికలు కాగానే వారిద్దరూ కలిసి బిహార్‌లో విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తారు' అని హెచ్చరించారు.

జేడీ(యు) అంటే జనతా కా దమన్‌ ఔర్‌ ఉత్పిదాన్‌.. (ప్రజల్ని అణచివేయడం, పీడించడం) అని అభివర్ణించారు. చేతిలో లాంతరును (ఆర్జేడీ చిహ్నం) పట్టుకున్నవారు బీహార్‌ను అంధకారంలో నెట్టేశారని ప్రధాని విమర్శించారు. బీహార్‌లో తలసరి విద్యుత్తు వినియోగం సిక్కిం కంటే తక్కువ ఉందని చెప్పారు. ఒడిశాలో 1.13 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లుంటే బిహార్‌లో 25 వేలే ఉన్నాయని గుర్తు చేశారు. అహంకార ధోరణితో ఉన్న నితీశ్‌.. కేంద్రంతో కలిసి అడుగులేసేందుకు రావడం లేదని నిందించారు.

ట్విట్టర్ పాలన: మోడీపై నితీష్ ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌ను బీమారు రాష్ట్రంగా పేర్కొనడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి స్థాయికి తగిన వ్యాఖ్యలు కాదన్నారు. ఆదివారం గయలో ప్రధాని బహిరంగ సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వృద్ధిరేటు, సామాజిక సూచికలైన విద్యా, ఆరోగ్యసంరక్షణ తదితర అంశాల్లో సాధించిన పురోగతి బీహార్‌ వెనకబడిన రాష్ట్రం కాదని చెబుతున్న విషయం గుర్తించాలన్నారు. నరేంద్ర మోడీది ట్విట్టర్ పాలన అని ఎద్దేవా చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+