మహారాష్ట్రలో మళ్లీ పూర్తి స్థాయి లాక్డౌన్...? ప్లాన్ ప్రిపేర్ చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు...
మహారాష్ట్రలో మరోసారి పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. స్టేట్ కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ సిఫారసు మేరకు లాక్డౌన్పై ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లాక్డౌన్కు సంబంధించి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOPs)ను రూపొందించాలని ఆదివారం(మార్చి 28) జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఒకవేళ లాక్డౌన్ విధిస్తే... ఆహార ధాన్యాలు,మెడిసిన్స్ ఇతరత్రా అత్యవసర వస్తువులు,సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అధికారులకు సూచించారు. ఆర్థిక కార్యకలాపాల కంటే ప్రజల ప్రాణాలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. అవసరమైనన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని... 80శాతం ఆక్సిజన్ ప్రొడక్షన్ మెడికల్ అవసరాలకే రిజర్వ్ చేసి ఉంచాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని... ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయల కల్పనకు అవకాశం లేకపోతే సమీప పట్టణాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్,వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.లాక్డౌన్ విధిస్తే ఎక్కడా ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు అధికారులకు తగిన సూచనలు జారీ చేస్తున్నామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సీతారాం కుంతె తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్ర విపరీతంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా రాష్ట్ర వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.ప్రదీప్ వ్యాస్ మాట్లాడుతూ... హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రతరమయ్యే పరిస్థితి అతి సమీపంలోనే ఉందన్నారు.ఆస్పత్రిలో బెడ్లు,వెంటిలేటర్లు,ఆక్సిజన్ తదితర వైద్య సౌకర్యాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి తలెత్తుతుందన్నారు.
రాష్ట్రంలో మొత్తం 3.57లక్షల ఐసోలేషన్ బెడ్లు ఉండగా ఇప్పటికే లక్ష బెడ్లు నిండిపోయాయని... మిగిలిన బెడ్లు కూడా నిండేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చునని అన్నారు. ఇక ఆక్సిజన్ బెడ్లలో 60,349 బెడ్లకు గాను 12,701 బెడ్లు ఇప్పటికే నిండిపోయాయని చెప్పారు.
కాగా,గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40,414 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి కోసం మార్చి 28 నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. నలుగురు లేదా అంతకుమించి ఎక్కువమంది ఎక్కడా గుమిగూడవద్దు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఇక పూర్తి స్థాయి లాక్డౌనే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది.