కాంగ్రెస్ జట్టు కెప్టెన్ సిద్ధూ: పంజాబ్లో గట్టెక్కుతుందా?
సిద్ధూ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాంగ్రెసులో చేరడంతో తనకు ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలిగిందని చెప్పారు. ఆయన కాంగ్రెసును గట్టెక్కిస్తారా..
చండీగఢ్\న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ కమ్ బిజెపి మాజీ ఎంపి నవజ్యోతి సిద్ధూ న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 - 14 వరకు లోక్ సభకు అమ్రుత్ సర్ స్థానానికి బిజెపి తరఫున ప్రాతినిధ్యం వహించిన సిద్ధూ చేరికతో కాంగ్రెస్ పార్టీ నూతన జవసత్వాలు సమకూరాయి. ఆయన వంటి సైద్ధాంతిక నిబద్ధత, ఏకాగ్రత, నిజాయితీ గల నేత రాకతో తమకు బలం చేకూరిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.
ఇది న్యూ ఇన్నింగ్స్: సిద్ధూ
పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో తనది నూతన ఇన్నింగ్స్ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేరుస్తానని ప్రకటించారు.కాగా, గత నవంబర్ నెలలోనే సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన పార్టీలో చేరికకు మార్గం సుగమమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు మూడు వారాల ముందు సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హస్తం పార్టీకి కొత్త బలం చేకూరింది. గత నవంబర్ నెలలోనే సిద్ధూ సన్నిహితుడు పర్గత్ సింగ్, సిద్ధూ సతీమణితోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.
అమ్రుత్సర్ నుంచి పోటీ.. రాష్ట్రమంతా ప్రచారం
అమ్రుత్ సర్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంచేస్తారు. ఒక క్రికెటర్గా, సెలబ్రిటీగా ఆయనకు గల ప్రజాదరణను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకున్నది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి), ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్), బిజెపిలపై ఎదురుదాడికి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అస్త్రంగా ఉపయోగపడనున్నారు.
అకాలీదళ్ ఎదురుదాడి
అధికార అకాలీదళ్ గుట్టంతా సిద్ధూకు తెలుసు కనుకనే డిప్యూటీ సిఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్.. పంజాబీల్లో భావోద్వేగాన్ని రగిల్చేందుకు పూనుకున్నారు. స్వర్ణ దేవాలయంపై దాడిచేసిన కుటుంబ పార్టీలో చేరాడని ఎద్దేవా చేశారు. గత 10 నెలలుగా ఎక్కడ దాక్కుకున్నారని ఎగతాళి చేసిన సుఖ్బీర్ సింగ్ బాదల్.. తమ మాజీ మిత్రుడు డిప్యూటీ సీఎం పదవి కావాలన్న ప్రతిపాదనకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ అంగీకరిస్తారా? అని సవాల్ చేశారు.
గత జూలైలో బిజెపికి గుడ్బై
గత జూలైలో సిద్ధూ రాజ్యసభ సభ్యత్వానికి, బిజెపికి రాజీనామా చేశారు. కొన్ని వారాల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తోపాటు కాంగ్రెస్ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. మాజీ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సిద్ధూ రాక కోసం ఆసక్తిగా ప్రయత్నాలు చేశారు. 2004లో బిజెపి నుంచి అమ్రుత్ సర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి బిజెపి టిక్కెట్ కేటాయించడం జీర్ణించుకోలేకపోయిన సిద్ధూ మౌనంగా వ్యవహరించారు. జైట్లీ ఓటమి పాలైనా.. సిద్ధూను రాజ్యసభకు పంపిన బిజెపి నాయకత్వం.. పంజాబ్ రాష్ట్రంలోని సంకీర్ణ భాగస్వామ్య పక్షం శిరోమణి అకాలీదళ్ నాయకత్వం సలహా మేరకు సిద్ధూను కట్టడి చేయడానికి విఫలయత్నం చేసింది. అది నచ్చకే గత ఏడాది బిజెపి నుంచి బయటకు వచ్చారు.
దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా కాంగ్రెస్
2007 నుంచి కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్నది. ప్రకాశ్ సింగ్ బాద్ సారథ్యంలో శిరోమణి అకాలీదళ్ - బిజెపి సంకీర్ణ ప్రభుత్వం పదేళ్లుగా పరిపాలన సాగిస్తోంది. మరోవైపు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి అధికార కూటమికి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సిద్ధూ చేరికతో విపక్షంపై పోరుకు సర్వ సన్నద్ధమవుతున్నది. పాటియాలాలోని జాట్ల సామాజిక వర్గానికి చెందిన సిద్ధూ టాప్ క్లాస్ క్రికెట్ ప్లేయర్గా పలు రికార్డులు నెలకొల్పారు.
కాంగ్రెస్ పార్టీలో పండుగ వాతావరణం
సిద్ధూ వంటి ప్రముఖులతోపాటు బిజెపి, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ల నుంచి పలువురు నాయకుల చేరికతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. సిద్ధూతోపాటు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి, బిజెపి నేత సత్పాల్ గొస్సైన్ కూడా చేరిన వారిలో ఉన్నారు. తమ పార్టీలో ఇతర పార్టీల నేతలు సామూహికంగా వచ్చి చేరడం తమకు పాజిటివ్ అంశమని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. పంజాబీలకు నిజమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. శిరోమణి అకాలీదళ్ - బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగెత్తిన పంజాబీలంతా తమ నిజమైన ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటున్నారన్నారు.
హస్తం పార్టీలో లుధియానా నుంచి మూడుసార్లు గెలిచిన గొస్సేన్
లుధియానా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి గొస్సేన్, బిజెపి లుధియానా కౌన్సిలర్ గురుదీప్ సింగ్ నీతూ, మరో బిజెపి నేత అమిత్ గొస్సేన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నేత, పంజాబ్ ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు మౌర్ సిమ్రాత్ కౌర్ ధాలివాల్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తమ పంజాబీలకు చేసిన వాగ్దానాలు పూర్తి బూటకమన్నారు. ఆప్ నాయకత్వం పూర్తిగా పార్టీ సిద్ధాంతాలు, నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కొంత మొత్తాలకు పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్నారు.
ఐదు నెలల తర్వాత కాంగ్రెస్ గూటికి అశోక్ ప్రసార్ పప్పి
తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్న ఆప్ నేతల్లో అశోక్ ప్రషార్ పప్పి ఒకరు. ఐదు నెలల క్రితమే ఆప్ లో చేరిన పప్పీ, కాంగ్రెస్ పార్టీ తరఫున లుధియానా ఈస్ట్ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ నేతలు అవినీతి పరులైన కొందరు వ్యక్తుల పార్టీ అని అన్నారు. ప్రజలను దోపిడీ కోసమే ఆ పార్టీ పనిచేస్తున్నదని ఆరోపించారు. ఆప్లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్ రాకేశ్ ప్రషార్ కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
అకాలీదళ్ నుంచి పలువురి చేరిక
అధికార అకాలీదళ్ పార్టీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ సీఎం చేరికకు కారణమైన బీరేందర్ గోయల్, పార్టీ సీనియర్ నేతన రాజిందర్ కౌర్ భట్టాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజీందర్ కౌర్ భట్టాల్ 1992లో బిజెపి తరఫున ఎమ్మెల్యేగా పోటీచేశారు. జన్మోహన్ శర్మ అనే మరో శిరోమణి అకాలీదళ్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 మార్చిలో శిరోమణి అకాలీదళ్ పార్టీలో చేరారు. ఆయన ఇంతకుముందు లుధియానా జిల్లా కాంగ్రెస్ కమిటీ అర్బన్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) అంటే బాదల్ కుటుంబం సారథ్యంలో అవినీతి పరుల ముఠా అధికారంలో ఉన్నదని కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ నేతలు తెలిపారు. 117 సభ్యులు గల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాకతో త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది.