ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు-మూడోరోజూ ఈడీ ముందుకు రాహుల్-పార్లమెంటులో ఎంపీల నిరసనలు
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసు, మూడు రోజులుగా ఢిల్లీలో సాగుతున్న విచారణ దేశ రాజధానిని వేడెక్కించాయి. వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అదే సమయంలో రాహుల్ కు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసనలు చేపడుతోంది. దీంతో ఉద్రిక్త పరరిస్ధితులు తలెత్తుతున్నాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని రెండు రోజులుగా విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ మూడో రోజుకూడా విచారణకు పిలిచారు. దీంతో రాహుల్ గాంధీ.. ఏఐసీసీ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే మూడో రోజు కూడా రాహుల్ పై ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో హంగామా సృష్టించారు. ఏఐసీసీ కార్యాలయానికి వస్తున్న కాంగ్రెస్ ఎంపీల్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు పార్లమెంటులో నిరసన తెలిపేందుకు వెళ్లారు. అదే సమయంలో ఈడీ కార్యాలయంలో రాహుల్ విచారణ జరుగుతుండగా. కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసనలు చేపట్టారు.
ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ విచారణ కొనసాగుతున్న సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఈడీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి స్ధానిక పీఎస్ లకు తరలించారు. అదే సమయంలో ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు. పార్లమెంటులోకి వెళ్లకుండా తమను ఢిల్లీ సీపీ ఎలా అడ్డుకుంటారో చూస్తామని కాంగ్రెస్ ఎంపీ మానికం ఠాకూర్ హెచ్చరించారు.