ఒక మోడీ నుంచి మరో మోడీ: రాహుల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) కుంభకోణంపై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు ఆయన ట్విట్టర్లో బుధవారం వ్యాఖ్యలు చేశారు
నీరవ్ మోడీ భారతదేశాన్ని దోచుకోవడానికి మార్గాలంటూ ఆయన కొన్ని అంశాలను క్రోడీకరించారు. నీరవ్ మోడీ పలుకుబడి పెంచుకుని దోచుకున్నారని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు.

ప్రధాని కౌగలించుకోవడం
రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు - 1. పిఎం మోడీని కౌగలించుకోవడం 2. ప్రధానితో దావోస్లోనూ కనిపించడం. ఆ పలుకుబడితో - ఎ. రూ.12,000 కోట్లు దోచుకోవడం బి. ప్రభుత్వం ఎటో చూస్తుండగా, మాల్యా మాదిరిగా దేశం విడిచి జారుకోవడం. ఒక మోడీ నుంచి మరో మోడీ... అని ట్విట్టర్లో వ్యాఖ్యానంచారు.
ప్రధానితో ఉన్న ఫొటో ట్వీట్
ఈ ఏడాది ప్రారంభంలో దావోస్లో ప్రధాని నరేంద్ర మోడీతో నీరవ్ మోడీ కలిసి ఉన్న ఫొటోను కాంగ్రెసు అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో పోస్టు చేశారు. గతంలో బిజెపి ప్రభుత్వం ముగ్గురు కరుడు గట్టిన టెర్రరిస్టులను ఎస్కార్టుతో విదేశీ వ్యవహారాల శాఖ పంపించిందని, ఇప్పుడు బిజెపి ప్రభుత్వంలోనే ప్రధాని ఆర్థిక ఉగ్రవాదులను, ఫ్రాడ్ చేసినవారిని దేశం విడిచి పారిపోయేందుకు సహకరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

ఏ పద్ధతి మీద..
దావోస్ వరల్డ్ ఎకనమిక్ పోరం సదస్సులో భారత ప్రధాని మోడీ భారత సిఈవోలతో కలిసి ఉన్న చిత్రాన్ని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గౌరవ్ గొగోయ్ కూడా ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ గ్రూపు ఫొటోలో మొదటి వరుసలో మధ్య కూర్చుని ఉండగా, నీరవ్ మోడీ రెండో వరుసలో నిలబడి ఉన్నారు. విదేశీ పర్యటనలకు సిఈవోలను ఏ పద్ధతి ప్రకారం ఎంపిక చేస్తున్నారని ఆయన మోడీని ప్రశ్నించారు.

మోడీ స్పష్టం చేయాలి...
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ ప్రధాని మోడీకి ప్రశ్నలను సంధించారు. నీరవ్ మోడీ పరారీపై ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోవడంలో ఓ పద్ధతిని పాటిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications