రాహుల్పై దిగ్విజయ్ నిజమే చెప్పారు: షానవాజ్ సెటైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సరైనవేననీ, ప్రధానమంత్రికి ఉండాల్సిన సరుకు(మెటీరియల్) రాహుల్కు లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ చురకంటించారు. అంతేగాక రాహుల్ గాంధీ ప్రధానికి తగరన్న విషయాన్ని దేశం తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
బాధ్యతలు తీసుకోకుండా పాలనాపగ్గాలు చేపట్టాలనే కొత్త ఆలోచన నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఉందని అన్నారు. గతంలో సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుని చివరి క్షణంలో మన్మోహన్ సింగ్కు ఆ బాధ్యతలు అప్పజెప్పినట్లే రాహుల్ మదిలోనూ అలాంటి ఆలోచనే ఉండేదని షానవాజ్ ఆరోపించారు.
పదేళ్లుగా వారే అధికారం చెలాయించినా ఎలాంటి బాధ్యత తీసుకోలేదనీ, 2జీ కుంభకోణంలో ఎ. రాజా జైలుకు వెళ్లినప్పుడూ ప్రధానినే తప్పుపట్టే ప్రయత్నం జరిగిందని అన్నారు. ఇది ఇలా ఉండగా రాహుల్ గాంధీపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల తీవ్రతను తగ్గించేందుకు కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగారు.
పార్టీ ఓటమిపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయనీ, ప్రతీ ఒక్క వ్యాఖ్యనూ అదేపనిగా పట్టించుకోవాల్సిన పనిలేదని మాజీ మంత్రి మనీష్ తివారీ చెప్పారు. రాజకీయాల్లో ఉంటూ దేశాన్ని పాలించకూడదని రాహుల్ గాంధీ ఎందుకు అనుకుంటారని కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి ప్రశ్నించారు.