బెంగళూరులో భారీ వర్షం, టెక్కీలకు సినిమా, తమిళనాడు దెబ్బకు తడిచిముద్ద అయ్యారు!
బెంగళూరు: బెంగళూరు నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం పడింది. సరిగ్గా ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడటం మొదలైయ్యింది. వర్షం దెబ్బకు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనారు.
సముద్రం
సముద్రంలో వాయుగుండం ఏర్పడటంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. దక్షిణ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
48 గంటల్లో భారీ వర్షాలు
48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రంలో చేపలు పట్టడానికి 48 గంటల పాటు ఎవ్వరూ వెళ్లకూడదని, సముద్ర తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు మనవి చేశాయి.
తమిళనాడు దెబ్బకు బెంగళూరు
తమిళనాడులో ఎప్పుడు వర్షాలు పడినా బెంగళూరులో 95 శాతం కచ్చితంగా వర్షం పడుతుంది. తమిళనాడులో పడుతున్న వర్షాల దెబ్బకు బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు తడిచి ముద్ద అయ్యాయి. సరిగ్గా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం మొదలైయ్యింది.
అఫీసులకే పరిమితం
టెక్కీలు, కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు చేస్తూ కార్లు ఉన్న వారు ఇళ్లకు బయలుదేరారు. బైక్ ల్లో సంచరించేవారు కార్యాలయాలకు పరిమితం అయ్యారు. వర్షం పూర్తిగా తగ్గిన తరువాత ఇళ్లకు వెళ్లాలని విధుల్లో నిమగ్నం అయ్యారు. మొత్తం మీద బెంగళూరులో వర్షం పడటంతో చల్లటి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.