అమ్మ బతికి ఉంటే.., నేనే సిఎస్ను..: ధ్వజమెత్తిన రామ్మోహన్ రావు,
తన కార్యాలయంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించడంపై రామ్మోహన్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.
చెన్నై: తన కార్యాలయంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించడంపై తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇప్పటికీ తానే చీఫ్ సెక్రటిరీని అని ఆయన అన్నారు. కొత్త సిఎస్ నియామకం చెల్లదని అన్నారు. తన ఇంటిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అమ్మ బతికి ఉంటే ఇలా జరిగి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. తమిళ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తన ఇంట్లో ఐటి అధికారులకు ఏం దొరికాయో తెలియదని ఆయన అన్నారు. తనను 26 గంటలపాటు హౌస్ అరెస్టు చేసి, సోదాలు నిర్వహించారని ఆయన అన్నారు.
ఎవరి అనుమతితో సిఎస్ కార్యాలయంలోకి ఐటి అధికారులు ప్రవేశించారని అడిగారు. తన కుమారుడు వివేక్ పేరు మీద సెర్చ్ వారంట్ తెచ్చి సోదాలు చేశారని, తన కుమారుడు ఏమైనా చీఫ్ సెక్రటిరీయా అన్నారు. తనను లక్ష్యం చేసుకున్నారని, తనకు ప్రాణ హాని ఉందని అన్నారు.
సిఎస్ కార్యాలయంపై దాడులు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన అన్నారు. తన కొడుకు పేరు మీద సెర్చ్ వారంట్ తెచ్చి తన కార్యాలయంలో సోదాలు నిర్వహించడమేమిటని అన్నారు. తన కుమారుడిని కూడా టార్గెట్ చేశారని అన్నారు. తన కుమారుడి ఇంట్లోకి వెళ్లి తుపాకి గురి పెట్టారని, తన కుమారుడు ఏమైనా నేరస్థుడా అని అన్నారు.
సెర్స్ వారంట్ తన పేరు మీద లేదని ఆయన చెప్పారు. చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో తనను నిర్బంధించి సోదాలు చేసారని ఆయన చెప్పారు. తన కుమారుడు తన నివాసంలో ఉండడం లేదని స్ప,్టం చేశారు. రాహుల్ గాంధీకి, మమతా బెనర్జీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడు తన నివాసంలో ఒక్క రోజు కూడా నివసించలేదని ఆయన స్పష్టం చేశారు.
లక్షా 12 వేల రూపాయలే...
ఐటి దాడులపై అన్ని వివరాలను తాను వెల్లడిస్తానని అన్నారు. 32 ఏళ్లు దేశానికి సేవ చేసిన అధికారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడిగారు. తన నివాసంలో 25 కిలోల వెండి దేవతా విగ్రహాలున్నాయని చెప్పారు. తన ఇంటిలో ఎవరు సోదాలు నిర్వహించారో తెలియదని అన్నారు. తన వద్ద లక్షా 12 వేల 322 రూపాయలున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన అడిగారు. సచివాలయంలోకి సిఆర్పిఎఫ్ ఎలా ప్రవేశిస్తుందని అడిగారు. చీఫ్ సెక్రటరీ ఛేంబర్లోకి ఎలా వస్తుందని ప్రశన్నిచారు. ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారా, సంబంధిత అధికారుల అనుమతి తీసుకున్నారా అని ఆయన అడిగారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.
తమిళ ప్రజలకు తాను ఎంతో సేవ చేశానని, తుఫాను వంటి విపత్తులు వచ్చినప్పుడు తాను ప్రజల మేలు కోసం పనిచేశానని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్రంపై కేంద్రానికి గౌరవం లేదని అన్నారు.
సిఎస్ కార్యాలయంపై దాడి చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన రక్షణ ఉంటుందని అడిగారు. గర్భంతో ఉన్న తన కోడలును చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టారని అన్నారు. ఇటువంటి స్థితిలో తమిళ ప్రజలను ఎవరు రక్షిస్తారని అడిగారు.
తాను 31ఏళ్ల నుంచి అనేక బాధ్యతలు చేపట్టానని అన్నారు. తమిళనాడు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తానని రామ్మోహన్ రావు తెలిపారు. ఐటీ దాడులపై అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఐటీ సోదాలపై కోర్టుకు వెళ్తానని ఆయన తెలిపారు. తన ఇంట్లో దొరికిన సొత్తుపై పంచనామా చేస్తానని, వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
శేఖర్ రెడ్డితో లావాదేవీలు లేవు..
శేఖర్ రెడ్తితో తనకు ఏ విధమైన లావాదేవీలు, సంబంధాలు లేవని స్పష్టం చేశారు. శేఖర్ రెడ్డి తనకు తెలిసినంత మాత్రాన సంబంధాలు ఉండాలని లేదని అన్నారు. తాను వివిధ హోదాల్లో పనిచేశానని, అటువంటి సందర్భాల్లో తనకు చాలా మంది పరిచయమవుతారని అన్నారు. తనకు తెలిసినవారందరితో తనకు సంబంధాలు అంటగడితే ఎలా అని అడిగారు.