ఆప్లో చీలికలు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. మైండ్ గేమా?
పంజాబ్ ఎన్నికల్లో ఓటమితో సిసోడియా వర్గంపై కేజ్రీవాల్ ఆగ్రహంతో ఉన్నారని సతీష్ ఉపాధ్యాయ అన్నారు.
న్యూఢిల్లీ: పంజాబ్లో ఎన్నికల ముందువరకు గెలుస్తామన్న ధీమాతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తీరా ఫలితాలు చూసి కళ్లు తేలేసింది. అధికారం చేజిక్కడం ఖాయమని తొలినుంచి బలంగా భావిస్తూ వచ్చిన ఆప్కు ఇది భారీ షాక్ అని చెప్పాలి.
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి తగిలిన ఎదురుదెబ్బను ఢిల్లీలో ఇప్పటినుంచే తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను బీజేపీ మొదలుపెట్టింది. ఈ వాదనకు ఊతమిచ్చేలా ఆప్ లో చీలికలంటూ ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ లో ఓటమితో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్య విబేధాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు.

నేతల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాల కారణంగా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోనుందని, ఆ విషయం తనకు ముందుగానే తెలిసిందని అన్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఓటమితో సిసోడియా వర్గంపై కేజ్రీవాల్ ఆగ్రహంతో ఉన్నారని సతీష్ ఉపాధ్యాయ అన్నారు.
అయితే బీజేపీ చేస్తున్న ఈ వాదనలు ఆప్ ను మైండ్ గేమ్ తో దెబ్బతీయడానికా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రితం ఎన్నికల్లో ఆప్ చేతిలో భంగపడ్డ బీజేపీ వచ్చే ఎన్నికల నాటికైనా ఢిల్లీలో బలం పుంజుకోవాలని ఆశిస్తుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
కాగా, ఇటీవలి పంజాబ్ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతామనుకున్న ఆప్.. కేవలం 20స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ఓట్ల శాతంలో ఆ పార్టీ అకాలీదళ్ కన్నా వెనుకబడిపోవడం కేజ్రీవాల్ ను విస్మయానికి గురిచేసింది. అకాలీదళ్ కు 31శాతం ఓట్లు పడగా.. ఆప్ కు కేవలం 25శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.












Click it and Unblock the Notifications