రష్యాను వీడనున్న పుతిన్: యుద్ధం తరువాత..తొలిసారి దేశం బయటికి: ఫోకస్ అంతా అక్కడే
మాస్కో: జర్మనీ వేదికగా జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని బవారియన్ ఆల్ప్స్ రీజియన్లో గల ష్లాస్ ఎల్మావ్లో ఈ సమ్మిట్ ఏర్పాటైంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ దీనికి అధ్యక్షత వహించారు. ఉగ్రవాదం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు, పర్యావరణం.. వంటి కీలక అంశాలు ఇందులో చర్చించారు. ప్రత్యేకించి రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంపైనా ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులు చర్చించారు.
అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్తో పాటు భారత్, అర్జెంటీనా, ఇండొనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇందులో పాల్గొన్నారు. సమ్మిట్ ప్రారంభంలోనే ఆయా దేశాలన్నీ ఉక్రెయిన్కు భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. జీ7 దేశాల కూటమి కలిసి ఉక్రెయిన్కు 29.5 బిలియన్ డాలర్ల బడ్జెట్ను కేటాయిస్తామని స్పష్టం చేశాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
అదే సమయంలో మరో శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కాస్పియన్ సదస్సు. కాస్పియన్ సముద్ర తీర ప్రాంత దేశాలు.. సమావేశం కానున్నాయి. తుర్క్మెనిస్తాన్ ఈ సమావేశానికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అజర్బైజాన్, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, రష్యా ఈ కాస్పియన్ సదస్సులో సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ భేటీకి హాజరు కానున్నారు. దీనికోసం బుధవారం ఆయన మాస్కో నుంచి తుర్క్మెనిస్తాన్ బయలుదేరి వెళ్లనున్నారు.
ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రకటించిన తరువాత పుతిన్.. రష్యాను వీడటం ఇదే తొలిసారి. తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గబాట్లో గురువారం ఉదయం ఈ సమ్మిట్ మొదలవుతుంది. అజర్బైజాన్, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, రష్యా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇందులో పాల్గొననున్నారు. నవంబర్లో ఇండోనేషియా వేదికగా ఏర్పాటయ్యే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా పుతిన్ వెళ్లనున్నారు.
కాగా- కాస్పియన్ సముద్ర జలాల వినియోగంపై న్యాయపరమైన హక్కులు, ఈ ప్రాంత దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తామని పుతిన్ విదేశాంగ విధానాలు, వ్యవహారాల సలహాదారు యూరి ఉషకోవ్ చెప్పారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రకటించిన అనంతరం అమెరికా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు.. రష్యాకు వ్యతిరేకంగా నిల్చున్న వేళ- ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తొలిసారి ఓ అంతర్జాతీయ స్థాయి సమావేశానికి హాజరు కానుండటంతో అందరి దృష్టీ అటే నిలిచింది.