శశికళ పెత్తనాన్ని ప్రశ్నిస్తోన్న జనం!: సెల్వం అలా చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే!
కొత్తగా సీఎంగా నియమితులైన పన్నీర్ సెల్వం శశికళను కలవాల్సిన అవసరమేముంది? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదా?
చెన్నై: తమిళ దివంగత సీఎం అమ్మ అస్తమయం తర్వాత అన్నాడీఎంకె రాజకీయాలన్ని చిన్నమ్మ శశికళ చుట్టు కేంద్రీకృతమవుతున్న సంగతి తెలిసిందే. అమ్మ నివాసం పొయెస్ గార్డెన్ నుంచి ప్రభుత్వ వర్గాలను నిర్దేశిస్తూ.. రాజ్యాంగేతర శక్తిగా చిన్నమ్మ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రస్తుతం తమిళనాట వినిపిస్తున్నాయి.
జయలలిత అంత్యక్రియలు పూర్తయిన రెండు రోజు నుంచే సీఎం పన్నీర్ సెల్వం సహా అన్నాడీఎంకె శ్రేణులు అంతా పొయెస్ గార్డెన్ లో శశికళ చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. అమ్మ ముందు మోకరిల్లినట్టుగానే శశికళ ముందు కూడా మోకరిల్లే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు.
ప్రజల్లో వ్యతిరేకత:
అన్నాడీఎంకె పగ్గాలు శశికళ చేతుల్లోకి వెళ్లడం ఇక లాంఛనమే అని వినిపిస్తోన్న తరుణంలో.. సీఎం సహా మంత్రులు వ్యవహరిస్తున్న తీరు తమిళ ప్రజల్లో అసంతృప్తిని రాజేస్తోంది. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తికి నిర్ణయాధికారాలను కట్టబెట్టే రీతిలో అన్నాడీఎంకె వర్గాలు వ్యవహరిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.చిన్నమ్మ పట్ల ఉన్న అసంతృప్తి ప్రస్తుతానికి అంతర్గతంగానే వినిపస్తున్నప్పటికీ.. బహిర్గతం అయ్యే సూచనలు కూడా లేకపోలేవనేది పలువురి అభిప్రాయం.
అసలు శశికళ ఎవరు?
అన్నాడీఎంకె శ్రేణులంతా శశిళకు లేని ప్రాధాన్యం కల్పించి.. ఆమె ముందు మోకరిల్లుతూ పోతే.. భవిష్యత్తులో ఆమె కుటుంబమంతా ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితి వస్తుందని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మనపక్కంకు చెందిన 35ఏళ్ల రాజు మాసిలమణి మాట్లాడుతూ..'అసలు శశికళ ఎవరు? పరిస్థితి ఇలాగే కొనసాగితే.. నేను అన్నాడీఎంకె అన్నాడీఎంకెకు ఓటేయను' అని అభిప్రాయపడ్డారు.
శశికళ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు?:
తన ఓటుతో నచ్చిన నేతను నాయకుడిగా ఎన్నుకునే హక్కు తనకు ఉందని, శశికళ లాంటి వ్యక్తిని నాయకురాలిగా తాను ఒప్పుకోనని చెన్నైకి చెందని వెన్నెల బాలమురుగన్ అభిప్రాయపడింది. ప్రశ్నించడానికి తానెందుకు భయపడాలని, శశికళ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని అభిప్రాయపడింది.
కిందిస్థాయి నేతల్లోను అదే అసంతృప్తి:
అన్నాడీఎంకె శ్రేణుల్లో కింది స్థాయి నేతల్లోను శశికళ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమ్మ స్థానంలో శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడం పట్ల వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పార్టీని కాపాడుకోవాల్సిన అవసరముంది కాబట్టి.. కొంతకాలం వేచి చూసే ధోరణితోనే వ్యవహరించడమే బెటర్ అనే ఆలోచనలో మరికొంతమంది అన్నాడీఎంకె నేతలు ఉన్నారు.
రాజకీయ పరిశీలకులది కూడా అదే మాట:
పేరుకే పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగిస్తూ.. ఆయన్ను నియంత్రించే వ్యక్తి శశికళ తెర వెనుక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ను సోనియా గాంధీ నియంత్రించినట్టు ప్రస్తుతం శశికళ ధోరణి కూడా అదే తరహాలో ఉందంటున్నారు.