నీళ్లూ పంచుకోవాలిగా, మళ్లీ మొదటికా: ఏపీ-టీ కృష్ణా జలవివాదంపై కోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆస్తులు, అప్పులు పంచినట్లే నీళ్లు కూడా పంచుకోవాలని, వారసులు తమ తల్లిదండ్రుల నుండి కాకుండా ఇతరుల నుండి ఆస్తులు కోరుకోరు కదా అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కృష్ణా జలాల వివాదంపై సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఉమ్మడి ఏపీకి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయించిన నీటిని ఇప్పుడు తెలంగాణ, ఏపీ పంచుకోవాలేమో? మరో రాష్ట్రం విడిపోతే మళ్లీ మొదటి నుండి వాదనలు వినాల్సి వస్తుందేమో? ప్రాథమికంగా చూస్తే రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరపాలేమో అనిపిస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ, తెలంగాణ, కర్నాటకలు దాఖలు చేసిన ఎస్ఎల్పీ విచారణార్హత పైన బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల పంత్లతో కూడిన ధర్మాసనం ముందు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
బ్రిజేష్ ట్రైబ్యునల్ అవార్డుపై సుప్రీంలో ఎస్ఎల్పీ4లు దాఖలు చేసే అర్హత ఎవరికీ లేదని మహారాష్ట్ర పేర్కొంది. నదీ జలాల వివాదాలపై గతంలోను సుప్రీం తీర్పులు వెలువరించిందని ఏపీ చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆసక్తికర పై వ్యాఖ్యలు చేశారు. కాగా, వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని చెబుతూ పిటిషన్ల విచారణ అర్హత గురించి ప్రస్తావించకుండా కేసును మే 6వ తేదీకి వాయిదా వేశారు.