ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపేశారు: సైకిల్పై వెళ్తుంటే.. బైక్స్పై వచ్చి!
తొలుత తమతో మాట్లాడాల్సిందిగా యువతిని వేధించిన యువకులు.. ఆపై కత్తులతో దాడి చేసి ఆమెను హత్య చేశారు.
లక్నో: స్కూల్కు వెళ్తున్న ఓ విద్యార్థినిని అడ్డగించిన కొంతమంది దుండగులు.. ఆమెను తీవ్రంగా వేధించారు. తమతో మాట్లాడాలని బలవంతపెట్టారు. అందుకు ఒప్పుకోకపోవడంతో.. అక్కడిక్కడే యువతిని కత్తితో పొడిచి హత్య చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని బాజా అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రగ్నీ దుబే(17) అనే బాలిక.. స్కూల్కు వెళ్తున్న సమయంలో బాన్ దేహీ అనే ప్రాంతం వద్ద.. బైక్స్పై వచ్చిన ఐదుగురు యువకులు ఆమెను అడ్డగించారు.
తమతో మాట్లాడాల్సిందిగా బలవంతం చేశారు. ఇందుకు యువతి ససేమిరా అనడంతో.. సైకిల్ పై ఉన్న ఆమెను కిందకు తోసేశారు. ఆ తర్వాత విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి పరిగెత్తే లోపే.. రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక ప్రాణాలు కోల్పోయింది.
బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుల కోసం వేట ప్రారంభమైంది. నిందితులు కొంతకాలంగా మృతురాలిని వేధిస్తూ వస్తున్నారని పోలీసులు పేర్కొనడం గమనార్హం. బాలిక స్థానికంగా ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిపారు.