షీనా బోరా హత్య, మీడియా ఓవర్ యాక్షన్: శివసేన
ముంబై: షీనా బోరా హత్య కేసు తప్ప మీడియాకు వేరే సమస్యలు పట్టడం లేదని శివసేన మండిపడింది. నిత్యం షీనా బోరా హత్య కేసుకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించింది. ముఖ్య ఘట్టాలను విస్మరించి షీనా బోరా హత్య కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై అశ్చర్యం వ్యక్తం చేస్తున్నది.
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా భావించే మీడియా ఇంత దిగజారిపోతుందని అనుకోలేదని తెలిపింది. ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం చాల బాధగా ఉందని విమర్శించింది. నిత్యం పదేపదే ఇంద్రాణి వెంటపడి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
1965 యుద్ధం 50వ వార్షికోత్సవం వివరాలు అంతగా ప్రచారం చెయ్యలేదని, సైనికుల త్యాగాలను పట్టించుకోకుండా ఇంద్రాణికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మీడియా వార్తలుగా మలుస్తోందని సామ్నా పత్రికలో శివసేన మండిపడింది.
అదే విధంగా విదర్బ, మరాత్ వాడ ప్రాంత ప్రజలను ఎందుకు పట్టించుకోలేదని, వారి సమస్యల గురించి ఎందుకు వార్తలు ప్రసారం చెయ్యడం లేదని ప్రశ్నించింది. ప్రజల సమస్యలు పట్టించుకుని తరువాత ఇంద్రాణి లాంటి వారి వార్తలు ప్రసారం చెయ్యాలని సూచించింది.
ఇంద్రాణి జైలులో ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఏం తాగుతుంది, నిద్రపోతుందా, లేదా, ఆమె ఉంటున్న గదిలో ఫ్యాన్ ఉందా, మంచం ఉందా, టీవీ ఉందా లేదా అని వార్తలు ప్రసారం చేస్తున్నారని, వాటితో ప్రజలకు ఏమి అవసరం అని ప్రశ్నించింది.
కరువు సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించింది. అదే విదంగా సరిహద్దులలో పాక్ పదేపదే కాల్పులు జరుపుతుంటే వాటికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని శివసేన ప్రశ్నించింది. షినా బోరా హత్య కేసు విషయంలో మీడియా ఓవర్ యాక్షన్ చేస్తుందని శివసేన చురకలు అంటించింది.