కశ్మీరీ పండిట్లకు మేమున్నాం.. మా తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయి: ఆదిత్య థాకరే
ఇటీవల కశ్మీర్లో పండిట్ల లక్ష్యంగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక అధికారి, ఒక టీచర్ చనిపోయారు కూడా. దీంతో కశ్మీర్ పండిట్లు తమ స్వస్ధలాలను వదిలి వెళుతున్నారు. దీనిపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే స్పందించారు. పండిట్లు రావాలని అనుకుంటే తమ రాష్ట్రానికి రావాలని కోరారు. తమ తలుపులు ఎప్పుడు తెరచే ఉంటాయని చెప్పారు.
కశ్మీర్లో ఇప్పుడు పండిట్లకు అంతా సానుకూల పరిస్థితి లేదన్నారు. అందుకోసమే వారిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పండిట్ల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అయితే పరిస్థితి సద్దుమణగలేదని వివరించారు.
కశ్మీర్ పండిట్ల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అడిగారు. అక్కడ 1990 నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం అయ్యాయని చెప్పారు. కశ్మీర్ లోయలో హత్య జరిగితే.. హోం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు.. దీంతో జరిగేది ఏమీ లేదు.. ఇక సమీక్షలు చాలు.. చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ అధికారంలోకి వస్తే కశ్మీర్ పండిట్ల సంగతి ఇలానే ఉంటుందని చెప్పారు. ఇప్పుడే కాదు.. ఇదివరకు రెండుసార్లు కూడా ఇలాగే జరిగిందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతీ సారీ పండిట్లు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. బీజేపీకి ఎప్పుడూ రాజకీయాలే కావాలి తప్ప.. కశ్మీర్ పండిట్ల ప్రయోజనాలు కాదని చెప్పారు.
గత నెలలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న రాహుల్ భట్ అనే కశ్మీర్ పండిట్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కానీ స్థానికులు మాత్రం భయాందోళనకు గురువుతన్నారు. ఆ తర్వాత మరో స్కూల్ టీచర్ను కాల్చి చంపారు. దీంతో మిగతా కశ్మీర్ పండిట్లు ఆందోళనకు దిగారు. తమను రీ లోకెట్ చేయాలని కోరుతున్నారు. కశ్మీర్ వెలుపల.. సురక్షితమైన ప్రాంతానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆదిత్య థాకరే.. అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.