అపస్మారకస్థితిలో లగడపాటి: కొట్టుకున్న టిడిపి ఎంపీలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ ముసాయిదా బిల్లు)ను లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మిరియాల పొడిని చల్లారు. ఈ సమయంలో ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో లగడపాటి మిరియాల పొడిని చల్లారు. సభ్యుల కళ్లలో నుండి నీళ్లు, దగ్గు వచ్చాయి. దీంతో సభ్యులు అయోమయానికి గురై పరుగు పెట్టారు. తెలంగాణ సభ్యులు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన మిరియాల పొడిని తన పైనే ప్రయోగించుకున్నారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
అంతకుముందు లగడపాటి పార్లమెంటులోను కంప్యూటర్ను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు మిరియాల పొడిని చల్లిన లగడపాటి రాజగోపాల్ను అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. స్ప్రేతో అస్వస్థతకు గురైన సభ్యులను పార్లమెంటు ఆవరణలోని ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు లోనైన వారిలో పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మైకులు విసిరారు. ఆయనను టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు ప్రాంతాల నేతలు బాహాబాహీకి దిగారు. మోదుగుల పైన నామా, రమేష్లు దాడికి యత్నించారు.