రైతుల ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన... ఇరువురూ సంయమనం పాటించాలని...
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ... ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం కూడా దీనిపై స్పందించింది. రైతుల ఆందోళనలు కొనసాగుతున్న ప్రస్తుత సందర్భంలో అటు ఆందోళనకారులు,ఇటు ప్రభుత్వం ఇరువురూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. అదే సమయంలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో శాంతియుత నిరసనను వ్యక్తం చేసే హక్కును కాపాడాల్సిందేనని పేర్కొంది. అందరి మానవ హక్కులను గౌరవిస్తూ సమస్యకు సముచితమైన పరిష్కారం కనుగొనడం కీలకమని అభిప్రాయపడింది.
పాప్ సింగర్ రిహన్నా,పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్,అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్,పోర్న్ స్టార్ మియా ఖలీఫా తదితర అంతర్జాతీయ సెలబ్రిటీలు ఇప్పటికే రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నేషనల్ సెలబ్రిటీల మద్దతును దేశీ సెలబ్రిటీలు వ్యతిరేకించడం హాట్ టాపిక్గా మారింది. భారతరత్న సచిన్ టెండూల్కర్,నటి కంగనా రనౌత్,దర్శకుడు కరణ్ జోహార్,నటుడు అజయ్ దేవగణ్ సహా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల జోక్యాన్ని తప్పు పట్టారు. ఇది భారత అంతర్గత వ్యవహారమని... ఇందులో ఇతరుల జోక్యానికి తావు లేదని పేర్కొన్నారు.
మరోవైపు ఇంటర్నేషనల్ సెలబ్రిటీల మద్దతును స్వాగతిస్తూ ట్వీట్లు చేసిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. పరోక్షంగా నటి తాప్సీ,స్వర భాస్కర్,సింగర్ దిల్జిత్ సహా తదితరులు వారి మద్దతును స్వాగతించారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా మొత్తం రెండుగా చీలికపోయింది. బీజేపీ,రైట్ వింగ్ శ్రేణులు అంతర్జాతీయ సెలబ్రిటీల మద్దతును వ్యతిరేకిస్తుండగా... మిగతావారు వారి మద్దతును స్వాగతిస్తున్నారు. గత రెండు నెలలకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోని టెండూల్కర్ లాంటి సెలబ్రిటీలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగడమేంటని చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీలో రైతుల ఆందోళనలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇందులో పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ పేరు ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అదేమీ లేదని పోలీసులు వెల్లడించారు.ఎంత వ్యతిరేకత వచ్చినా, రైతుల ఆందోళనలకు తన మద్దతు కొనసాగుతుందని గ్రెటా ట్విట్టర్లో స్పష్టం చేశారు. విద్వేషం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎంత వచ్చినా తన వైఖరి మారదని తేల్చి చెప్పారు.
#India: We call on the authorities and protesters to exercise maximum restraint in ongoing #FarmersProtests. The rights to peaceful assembly & expression should be protected both offline & online. It's crucial to find equitable solutions with due respect to #HumanRights for all.
— UN Human Rights (@UNHumanRights) February 5, 2021