జైల్లో నీరసంగా శశికళ.. టేబుల్ ఫ్యాన్, పరుపు కోసం మరోసారి దరఖాస్తు!
చిన్నమ్మ జైలు వాతావరణానికి ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారని, ఆరోగ్యం బాగానే ఉన్నా కాస్త నీరసంగా కనిపిస్తున్నారని పుగాజెండి తెలిపారు.
బెంగుళూరు: అదృష్టం కొద్దిపాటిలో మిస్ అవడంతో సీఎం కావాల్సిన చిన్నమ్మ జైల్లో జీవితం వెళ్లదీయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలోను జైలు జీవితం గడిపిన అనుభవమున్నా.. ఇప్పుడు కనీస సౌకర్యాలు కూడా ఆమెకు అందుబాటులో లేకపోవడం జైల్లో చిన్నమ్మకు అంత సులువేమి కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే వీటన్నింటికి భిన్నంగా ఆమె జైలు జీవితానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్లు అన్నాడీఎంకె వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకె కర్ణాటక విభాగం కార్యదర్శి వి.పుగాజెండి పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను పరప్పన జైల్లో కలిశారు. అనంతరం ఆమె జైలు జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
చిన్నమ్మ జైలు వాతావరణానికి ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారని, ఆరోగ్యం బాగానే ఉన్నా కాస్త నీరసంగా కనిపిస్తున్నారని పుగాజెండి అన్నారు. షుగర్ లెవల్స్, రక్తపోటు సాధారణంగానే ఉన్నట్లు తెలిపారు. కాగా, పరప్పన జైలు నుంచి తమిళనాడుకు వెళ్లేందుకు శశికళ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆమె వయసు, ఆరోగ్యం రీత్యా కనీస అవసరాలైన ఎటాచ్ బాత్రూమ్ తో కూడిన సెల్, మంచం, పరుపు, ఒక టేబుల్ ఫ్యాన్ వంటి సౌకర్యాలు జైలు అధికారులు ఆమెకు కల్పిస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
కాగా, తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని శశికళ తరుపున వేసిన పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేయడంతో.. కనీసం టేబుల్ ఫ్యాన్, పరుపునైనా అనుమతించాలని ఆమె మరోసారి పిటిషన్ ద్వారా కోరినట్లు తెలియజేశారు.
తమిళనాడు సీఎం పళనిస్వామి త్వరలోనే న్యాయవాదులతో కలిసి జైలు వద్దకు వచ్చి, ఆమెను చెన్నై తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారని పుగాజెండి వివరించారు. గతంలోను గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న అనుభవం శశికళకు ఉందని ఈ సందర్బంగా గుర్తుచేశారు.