'భారత్లో పఠాన్కోట్ తరహాలో మరిన్ని దాడులు'
న్యూఢిల్లీ: జమాత్ ఉద్ దావా చీఫ్, కరుడు గట్టిన ఉగ్రవాది హఫీద్ సయీద్ భారత్పై పఠాన్కోట్ తరహాలో మరిన్ని దాడులు జరుగుతాయని బుధవారం ప్రకటించాడు. భారత్లో ఉగ్రదాడులు ఎక్కువ శాతం పాకిస్తాన్ నుంచే జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఓ బహిరంగ సభలో హఫీజ్ సయీద్ ఈ ప్రకటన చేశాడు.
800,000 భారత సైనికులను కాశ్మీరీలపై మారణహోమం సృష్టిస్తుంటే, అందుకు ప్రతిగా పఠాన్ కోట్ తరహా దాడులను చేస్తామని హెచ్చరించాడు. కాశ్మీరీ మిలిటెంట్ లీడర్ సయ్యద్ సలాఉద్దీన్పై హఫీజ్ సయీద్ ప్రశంసల వర్షం కురిపించాడు. హఫీజ్ సయీద్ వ్యాఖ్యలతో భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
హఫీజ్ వ్యాఖ్యలతో భారత్లోని ఎయిర్బేస్ల వద్ద అనుమానాస్పదంగా సంచరించేవారిపై కాల్పులు జరపడానికి వీలుగా భారత వైమానిక దళం షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక హఫీజ్ సయీద్ విషయానికి వస్తే 2008లో ముంబైపై జరిపిన ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి.
హఫీజ్ సయీద్ తలకు అమెరికా లక్ష డాలర్ల వెల కట్టింది. అయినా సరే పాకిస్థాన్లో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్న సయీద్ను అక్కడి ప్రభుత్వం ఏనాడూ నిర్బంధించలేదు. మరోవైపు పఠాన్కోట్ ఉగ్రదాడిలో టెర్రరిస్టులు వాడిన ఆయుధాలను పంజాబ్లోని బమియాల్ నుంచి తరలించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కనుగొంది.
ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించినప్పుడు తమతో పాటు ఆయుధాలను తీసుకురాలేదని దర్యాప్తులో ఎన్ఐఏ గుర్తించింది. ఆ ఆయుధాలను ముందుగానే పఠాన్కోట్ ఎయిర్బేస్కు తరలించినట్లు ఎన్ఐఏ కనుగొంది. అసలు ఎయిర్బేస్లోనివారే ఉగ్రవాదులకు సహకరించారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.