లగ్జరీ హోటల్లో ఉగ్రదాడి, 9మంది హత్య: 20 మంది భారతీయులు సహా 170 మంది బందీ
మాలి: ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్లోకి చొరబడి అక్కడి వారిని బందీలు తమ తీసుకున్నారు.
ఉగ్రవాదుల చెరలో సుమారు 170 మంది ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బందీల్లో ఎక్కువ మంది బ్రిటన్, అమెరికన్లే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హోటల్ వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
ఆటోమెటిక్ ఆయుధాలు, బాంబులు ధరించిన ఉగ్రవాదులు సెక్యూరిటీ గార్డులను హత్య చేసి, లోపలికి వెళ్లారని తెలుస్తోంది. ఏడవ అంతస్తులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే, హోటల్లోని వారిని బందీలుగా పట్టుకున్నారు.
హోటల్లో ప్రవేశించిన జీహాదీ ఉగ్రవాదులు పదిమంది వరకు ఉన్నారని చెబుతున్నారు. కాగా, హోటల్లో ఉన్న 170 మందిలో 140 మంది అతిథులు. 30 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు. ఐదుగురు ఐరాస సిబ్బంది, బందీల్లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బంది కూడా ఉన్నారని తెలుస్తోంది. ఉగ్రవాదుల దాడిలో తొమ్మిది మంది మృతి చెందారని సమాచారం. ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయి.
బందీల్లో చైనీయులు కూడా ఉన్నట్లు చైనా మీడియా వెల్లడించింది. వీ చాట్ మొబైల్ యాప్ ద్వారా చెన్ అనే వ్యక్తి హోటల్లో చిక్కుకుపోయిన చైనీయుల్లో తాను కూడా ఉన్నట్లు చైనా మీడియాకు సమాచారం అందించారు. కాగా, గత ఆగస్టులోనే మాలిలో ఇలాంటి ఉగ్రదాడి జరిగింది. మాలిలోని సెవేర్ హోటల్లో ఉగ్రవాదులు జొరబడి 13 మందిని చంపారు.
తాను రోజులాగే రాడిసన్ హోటల్ సమీపంలో ఉన్న పాఠశాలకు నా పిల్లల్ని తీసుకెళ్లానని, ఇంతలో తుపాకుల శబ్దం వినిపించాయని, వణికిపోయామని, మాకు కొద్ది దూరంలోనే భారీ పేలుడు సంభవించిందని, దీంతో దగ్గరలో ఉన్న నా సోదరి నివాసానికి నా బిడ్డలను ఎత్తుకొని పరుగు తీశానని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
బందీల్లో 15మంది భారతీయులు
ఉగ్రవాదుల బందీల్లో పదిహేను మంది భారతీయులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. బందీల్లో ఉన్న వారిలో ఏడుగురు చైనీయులు, ఆరుగురు టర్కిష్ ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా ఉన్నారు. భారతీయులు ఇరవై మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.