రగిలిన గల్ఫ్ దేశాలు: సౌదీ అరేబియా, యుఏఈపై క్షిపణి దాడులు: తీవ్ర ఉద్రిక్తత
అబుధాబి: గల్ఫ్ దేశాల్లో మరోసారి అనిశ్చిత పరిస్థితి నెలకొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యెమెన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్ మద్దతు ఇస్తోన్నట్లుగా అనుమానిస్తోన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎమిరేట్స్పై బాంబు దాడికి పాల్పడ్డారు. డ్రోన్లతో వరుసగా బాంబులను సంధించారు. రాజధాని అబుధాబిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారు. అదే సమయంలో సౌదీ అరేబియాపైనా శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడులకు ఈ రెండు దేశాలు కూడా సమర్థవంతంగా తిప్పి కొట్టాయి.
దాడులు- ప్రతిదాడులతో..
ఈ నెల 17వ తేదీన హౌతీ తిరుగుబాటుదారులు.. అబుధాబిపై డ్రోన్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తాన్ పౌరుడు దుర్మరణం పాలయ్యారు. ముసప్ఫా పారిశ్రామిక ప్రాంతంలోని అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, అల్ బతీన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నిర్మాణ స్థలంలో రెండు బాంబుదాడులు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోని మూడు ఆయిల్ ట్యాంకర్లు ఈ దాడిలో ధ్వంసం అయ్యాయి.
హౌతి తిరుగుబాటుదారులపై..
అబుధాబిపై దాడికి పాల్పడింది తామేనంటూ హౌతి తిరుగుబాటుదారులు వెల్లడించారు. అరబ్ ఎమిరేట్స్ మద్దతు ఇస్తోన్న ఉమ్మడి సైనిక బలగాలు ఇటీవలే యుమెన్లోని షాబ్వా, మరీబ్ రీజియన్లపై వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు దిగినట్లు స్పష్టం చేశారు. ఈ రెండు రీజియన్లపైనా హౌతీ ఉద్యమకారులకు గట్టి పట్టు ఉంది. వారి ప్రాబల్యం ఎక్కువ. దీనికి ప్రతీకారంగా వారు అబుధాబిపై డ్రోన్లతో దాడికి దిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
సనాపై దాడులు..
దీని తరువాత సౌదీ అరేబియా సారథ్యంలోని అరబ్ దేశాల సంయుక్త బలగాలు హౌతీ తిరుగుబాటుదారులను కంటి మీద కునుకు లేకుండా చేశాయి. యెమెన్ రాజధాని సనలోని వారి స్థావరాలను ధ్వంసం చేశాయి. బాంబుల వర్షాన్ని కురిపించాయి. ఈ దాడులు- ప్రతిదాడులతో మధ్య-తూర్పు ఆసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని నివారించడానికి అంతర్జాతీయ వేదికల మీద ప్రయత్నాలు సాగాయి. అవేవీ ఫలించలేదు.
తాజాగా మళ్లీ..
ఇప్పుడు మళ్లీ దాడులు తీవ్రతరం అయ్యాయి. హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారు. సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్ను టార్గెట్గా చేసుకున్నారు. సౌదీలోని దహ్రాన్ అల్ జనుబ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ తెల్లవారు జామున బాలిస్టిక్ క్షిపణులను సంధించారు. అదే సమయంలో అబుధాబిపై డ్రోన్లతో బాంబులను సంధించే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలను తాము విఫలం చేసినట్లు అరబ్ సంయుక్త సైనిక బలగాలు ప్రకటించాయి. బాలిస్టిక్స్ క్షిపణులు, డ్రోన్లను నేల కూల్చినట్లు వెల్లడించాయి.
Recommended Video
ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదంటూ..
సౌదీ అరేబియా సరిహద్దులకు ఆనుకుని యెమెన్ భూభాగంపై గల అల్-జాఫ్ రీజియన్ నుంచి ఈ బాలిస్టిక్స్, డ్రోన్ల ప్రయోగం సాగినట్లు పేర్కొన్నాయి. అవి ల్యాండ్ కాకముందే తాము పేల్చేశామని, పలితంగా ప్రాణ, ఆస్తినష్టాన్ని నివారించగలిగామని ఎమిరేట్స్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. హౌతి తిరుగుబాటుదారులు అత్యాధునికమైన డ్రోన్లు, బాలిస్టిక్స్ క్షిపణులను ఈ దాడుల కోసం వినియోగిస్తున్నాయని పేర్కొంది.