పాకిస్తాన్కు పట్టుబడిన పైలట్: ఏమిటీ జెనీవా ఒప్పందం?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ పాక్ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయనపై పాక్ తీవ్రంగా దాడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో భారత్ సహా విపక్షాలు జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించవద్దని సూచిస్తున్నాయి. దీంతో జెనీవా ఒప్పందం ఏమిటనే చర్చ సాగుతోంది.
జెనీవా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ మన సైనికుడిని తమ అదీనంలోకి తీసుకుంటే వారం రోజుల్లో తిరిగి అప్పగించారు. లేదంటే ఇరుదేశాలు అధికారికంగా యుద్ధంలోకి దిగినట్లేనని భావిస్తారు. ప్రస్తుతం ట్విట్టర్లో జెనీవా ఒప్పందం ట్రెండింగ్లో ఉంది. పాక్ ప్రజలు కూడా పలువురు.. పట్టుబడిన భారత పైలట్ను వారికి అప్పగించాలని చెబుతున్నారు.
పట్టుబడిన వారితో ఎలా వ్యవహరించాలనేదే జెనీవా ఒప్పందం
యుద్ధంలో పట్టుబడిన సైనికులు లేదా ప్రజలతో ఎలా వ్యవహరించాలనేది జెనీవా ఒప్పందం చెబుతుంది. యుద్ధ ఖైదీల హక్కులను జెనీవా సమావేశం నిర్వచించింది. యుద్ధ సమయంలో గాయపడిన లేదా అనారోగ్యంతో పట్టుబడిన సైన్యం లేదా ప్రజల పట్ల ఎలా ఉండాలో ఇందులో పేర్కొన్నారు. జెనీవా ఒప్పందంలో నాలుగు అంశాలు ఉన్నాయి. 1949లో మూడు సవరణలతో ఈ ఒప్పందానికి కొత్త రూపు ఇచ్చారు.
జెనీవా మొదటి, రెండు ఒప్పందాలు
జెనీవా మొదటి ఒప్పందం.. గాయాలతో పట్టుబడిన లేదా అనారోగ్యంతో ఉన్న సైనికులకు సంబంధించినది. రంగు, ఆడ-మగ, మతం, ఏ ప్రాంతం వారు, ధనం.. ఇలా ఏ ఇతర ఆధారాలతో వారిని వేధించరాదు. వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. ఎలాంటి విచారణ లేకుండా యుద్ధంలో పట్టుబడిన వారిని వేధించవద్దు, హింసించవద్దు, ఉరి తీయవద్దు. వారికి సరైన వైద్య చికిత్స అందించాలి. పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. జెనీవా రెండో ఒప్పందం నౌకాదళానికి, ఇతర నేవీ దళాలకు వర్తిస్తుంది.
జెనీవా మూడో ఒప్పందం
జెనీవా మూడో ఒప్పందం యుద్ధంలో పట్టుబడిన ఖైదీ గురించి చెబుతుంది. వీరికి కూడా మొదటి ఒప్పందంలోనివి వర్తిస్తాయి. ఇలా పట్టుబడిన వారి పేర్లు, ర్యాంకులు, సీరియల్ నెంబర్లు మాత్రమే.. పట్టుకున్న వారు తీసుకోవాలి. అంతే తప్ప, ఆ దేశం గురించి ఇతర సమాచారం తెలుసుకునేందుకు పట్టుబడిన వ్యక్తిని హింసించవద్దు. జెనీవా నాలుగో ఒప్పందం ప్రకారం.. గాయపడిన లేదా అనారోగ్యం పాలైన సైనికులు లేదా పట్టుబడిన ప్రజల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి, రక్షణ కల్పించాలి.