ప్రపంచానికి చైనా అవసరం: మూడోసారి అధ్యక్షుడిగా జీ జీన్పింగ్ రికార్డ్
బీజింగ్: జీ జిన్పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మరో ఐదేళ్లపాటు ఆయన చైనా అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారీ ఆయనే ఎన్నికయ్యారు.
అత్యంత అరుదైన ఈ ఎన్నికతో.. దిగ్గజ నేత మావో జెడాంగ్ తర్వాత తిరిగి అంతటి శక్తివంతుడైన అధినాయకుడిగా నిలిచారు 69 ఏళ్ల జీ జిన్పింగ్. కాగా, సీపీసీ మహాసభలు శనివారం ముగిశాయి. చైనా దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి జీ జిన్పింగ్ కు పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైంది. ఇక ఆదివారం స్టాండింగ్ కమిటీ కూడా ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది.
చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన తర్వాత జీ జిన్ పింగ్ మాట్లాడుతూ.. ప్రపంచానికి చైనా అవసరం చాలా ఉందని వ్యాఖ్యానించారు. "ప్రపంచం లేకుండా చైనా అభివృద్ధి చెందదు, ప్రపంచానికి చైనా కూడా అవసరం" అని జి అన్నారు. 40 సంవత్సరాలకు పైగా సంస్కరణలను కొనసాగించామన్నారు. దీంతో వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, దీర్ఘకాలిక సామాజిక స్థిరత్వం అనే రెండు అద్భుతాలను సాధించామన్నారు.
ఆదివారం చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ 25 మంది నాయకులతో సమావేశమై పొలిటికల్ బ్యూరోను ఎన్నుకుంది. చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 అయినప్పటికీ.. 2018లోనే పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన నేపథ్యంలో జిన్పింగ్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఒక వ్యక్తి రెండుసార్లు కన్నా ఎక్కువసార్లు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాజ్యాంగ సవరణ వల్ల జీ జిన్ పింగ్కు ఎదురులేకుండా పోయింది.
మరోవైపు, చైనా కమ్యూనిస్టు పార్టీపై జీ జిన్పింగ్ పూర్తి పట్టును సాధించారు. ఈ క్రమంలోనే పార్టీలో తన తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశ ప్రధాని, పొలిట్ బ్యూరోతోపాటు స్టాండింగ్ కమిటీలో సభ్యుడైన లీ కెకియాంగ్కు ఉద్వాసన పలికారు. అంతేగాక, మరో ముగ్గురు సీనియర్ నేతలను కూడా పార్టీ కేంద్ర కమిటీ నుంచి తొలగించి తన మార్గానికి ఎవరూ అడ్డులేకుండా చేసుకున్నారు.