12,521 మంది ఖాతాల్లో దళితబంధు నగదు జమ: మంత్రులు
దళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్షించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్రావు, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లతో దళితబంధు సర్వే, పథకం అమలుపై సమీక్ష జరిగింది. పథకంపై మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గంలోని 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. మిగతా లబ్ధిదారుల ఖాతాల్లో వేగంగా నిధులు జమ చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
అకౌంట్లలో నిధులు జమైన వెంటనే లబ్ధిదారులకు తెలుగులో సమాచారం పంపాలని అధికారులు సూచించారు. సర్వేను సమర్థవంతంగా పని చేసిన అధికారులకు మంత్రి కొప్పుల అభినందనలు తెలిపారు. సర్వేలో డోర్ లాక్ ఉన్న, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, తప్పిపోయిన కుటుంబాల ఇళ్లను ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో రీ వెరిఫికేషన్ చేయాలని మంత్రులు నిర్ణయించారు. పథకం కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థికంగా ఉన్న తమకు డబ్బులు వద్దని, ఇతర పేద కుటుంబాలకు సహాయం అందించాలని గివ్ ఇట్ అఫ్ కింద ఇచ్చారని ఉద్యోగులను మంత్రులు అభినందించారు.
18 ఏళ్లలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాధ పిల్లలకు మానవత దృక్పథంతో వెంటనే దళితబంధు పథకం మంజూరు చేసి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని మంత్రులు నిర్ణయానికి వచ్చారు. పథకంలో డెయిరీ యూనిట్లను ఎంచుకున్న లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యతగా.. కరీంనగర్, విజయా డెయిరీ భాగస్వామ్యంతో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని, దళితులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా బ్యాంక్ ఖాతాల్లో పథకం డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. సర్వేలో కార్లు కొనుగోలుకు 3,200 మంది, ట్రాక్టర్ల కొనుగోలుకు 3,200 మంది తీసుకునేందుకు ఆప్షన్ ఇచ్చారని.. ఇన్ని కార్లు, ట్రాక్టర్లు నడవడం కష్టం కనుక తిరిగి అధికారులు వారి ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి ఇచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి యూనిట్లు ఎన్నుకునేలా చూడాలని అధికారులకు సూచించారు.
త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో మెడికల్, ఫర్టిలైజర్, వైన్స్, సివిల్ సప్లయ్ షాపులు, రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాలు, ఆసుపత్రులు తదితర రంగాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుందని, అందులో ఉపాధి అవకాశాలు పొందేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పథకంలో ఒకే లబ్ధిదారుడు రెండు, మూడు యూనిట్లు ఎంచుకునే అవకాశం కూడా ఉందన్నారు. సర్వేను సమర్థవంతంగా నిర్వహించినందుకు కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, సిబ్బందిని మంత్రులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మొత్తం యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే వరకు కొనసాగించాలని సూచించారు.
Recommended Video
సమావేశంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, నగర మేయర్ వై సునీల్ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, సంధ్యా రాణి, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.