అగ్గిరాజేసిన లఖీమ్పూర్ ఘటన: కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.. పరిహారం ఇవ్వాలని డిమాండ్
ఉత్తరప్రదేశ్ లఖీమ్పూర్ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైతులు/ రైతు నేతలు ఆందోళన తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. మెట్ పల్లి మండలం వేంపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులకు మద్దతు ధర కోసం శాంతియుతంగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఉత్తరప్రదేశ్ లఖింపూర్లో కూడా రైతులు నిరసన తెలియజేస్తుండగా.. కేంద్రమంత్రి కుమారుడు కారుతో తొక్కించాడు. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 9 మంది చనిపోయారు. దీనిని నిరసిస్తూ వేంపేట్ గ్రామంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ,రైతు నాయకులు దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ అల్లూరి మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, రైతులు కొమ్ముల రాజరెడ్డి, వెల్మల రాజరెడ్డి, అల్లూరి సురేందర్ రెడ్డి,నల్ల శేఖర్ రెడ్డి, ఏలేటి తిరుపతి రెడ్డి, తుమ్మల లింగారెడ్డి, దనిరేకుల రమేష్, మారు రంజిత్, గోరుమంతుల నరేష్, గోరుమంతుల రఘు, పెంటపర్తి శ్రీనివాస్, బింగి శరత్, జెల్ల మహేష్, జెల్లా సంతయ్య తదితరులు పాల్గొన్నారు.
లఖిమ్పూర్ ఖేరీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కార్యక్రమానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న రైతులు నల్లజెండాలతో నిరసన తెలుపాలని భావించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ కారు రైతులపైకి దూసుకొచ్చింది. అందరు చూస్తుండగానే రైతులను ఢీ కొని వెళ్లిపొయింది
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు స్వాగతం పలికి తీసుకొచ్చేందుకు ఆశీష్ మిశ్రా వెళ్తున్నట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అదనపు డీజీపీ ప్రశాంత్కుమార్ను లఖిమ్పూర్ ఖేరీకి వెళ్లి పరిస్థితి సద్దుమణిగేలా చూడాలని ఆదేశించారు. పలువురు ఉన్నతాధికారులు లఖిమ్పూర్ ఖేరీలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు డీజీపీ ముకుల్ గోయల్ తెలిపారు.