కరీంనగర్లో మళ్లీ మావోయిస్టుల అలజడి.. లింకులు బయట పడిందిలా..?
కరీంనగర్ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు తీసుకువెళ్తున్న వారిని చత్తీస్ ఘడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కరీంనగర్ జిల్లాకు మవోయిస్టులతో ఉన్న సంబంధాలు మరో సారి బయటపడ్డాయి. జిల్లాలో గ్రానెట్ వ్యాపారస్తులకు మావోయిస్టులతో ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఎన్టీఆర్, తమిళ కాలనీలకు చెందిన రాజా గోపాల్, ఖాసిమ్ను గడ్చిరోలి జిల్లా దామ్రాంచ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు కార్డెక్స్ కేబుల్స్ తరలిస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు ఆధ్వర్యంలో పోలీసు బృందం గడ్చిరోలికి వెళ్లింది.
పోలీసుల ఆరా..
మావోయిస్టుల సంబంధాలపై జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. తమిళ కాలనీ, బావుపేట, కశ్మీర్ గడ్డ, ఫజల్ నగర్, కిసాన్ నగర్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముకరంపురాలో పురుషోత్తం అనే వ్యక్తిని తమ వెంట గడ్చిరోలి తీసుకు వెళ్లారు. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే కార్డెక్స్ వైర్ బండిల్స్ను సరఫరా చేస్తున్న నలుగురు ఆదివారం గడ్చిరోలి జిల్లా పోలీసులకు పట్టుబడినట్లు ఎస్పీ అంకిత్ గోయల్ ప్రకటించారు.
అహేరి తాలూకా దామ్రాంచ-బంగారంపేట గ్రామాల అటవీ ప్రాంతాల మీదుగా 20 కార్డెక్స్ వైర్ బండిల్స్ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేసి పట్టుకున్నారు.
వీరే
మావోయిస్టు సానుభూతిపరులు కరీంనగర్ జిల్లాకు చెందిన రాజాగోపాల్ సల్ల, మహ్మద్ ఖాసీం షాదుల్లా, గడ్చిరోలి జిల్లాకు చెందిన కాశీనాథ్, సాధుల లచ్చాతలండి పట్టుబడగా.. వీరి నుంచి 3,500 కార్డెక్స్ వైర్ బండిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. విచారణలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, వివిధ లాంచర్లు, హ్యాండ్గ్రనేడ్లు, ఐఈడీఎస్ తయారు చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మరోసారి కరీంనగర్ జిల్లాలో మావోయిస్ట్ లింకులు బయట పడినట్లయింది.
పట్టించుకోలే.. కానీ
నిందితులు గ్రానైట్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ప్రాంతం వాసులు కావడం, నిరంతరం గ్రానైట్ కోసం పేలుడు పదార్థాలు వినియోగించడం సాధారణం కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొ ఘటనలో మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉండి పార్టీలో చేరేందుకు సిద్ధమైన వ్యక్తిని జనవరిలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మావోయిస్టు లింకులు జిల్లాలో బయటపడ్డాయి.
గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన ఒకరు వికారాబాద్కు చెందిన మరో ఇద్దరితో కలిసి మావోయిస్ట్ పార్టీలో చేరేందుకు వెళ్తున్నట్లు గుర్తించి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.