కొత్త దందా: ఏటీఎం సెంటర్ల వద్ద నోట్ల వ్యాపారం
వరంగల్: నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టేందుకు రూ. 500, 1000 నోట్లను కేంద్రం రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు నోట్ల మార్పిడి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు కొత్త వ్యాపారాన్ని సృష్టించుకుంటున్నారు.
వరంగల్ నగరంలో కూడా ఏటీఎం సెంటర్ల వద్ద కరెన్సీ నోట్ల మార్పిడి వ్యాపారం జోరుగా సాగుతోంది. రూ. 500, 1000 నోట్లు అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఏటీఎం సెంటర్లలో చాలా మంది ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకున్నారు. దీంతో ఏటీఎం సెంటర్లలో నగదు లావాదేవీలు నిలిచిపోయాయి.
బుధవారం ఏటీఎం కేంద్రాలు మూసివేయడం, రూ. 100నోట్లకు డిమాండ్ ఉండటంతో కొందరు దీన్ని వ్యాపారంగా మార్చేశారు. రూ.500 నోటుకు రూ.100లను కమీషన్ తీసుకొని కేవలం రూ.400 తిరిగి ఇస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో రూ.100నోట్లు లేవంటూ రూ.500లకే పెట్రోల్ పోస్తున్నారు.
పాన్షాప్లు, టీ దుకాణాలు, వివిధ వ్యాపార సంస్థల్లో పెద్ద నోట్లను తీసుకోవడం లేదు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కూడా రూ.500, రూ.1000 నోట్లతో వచ్చిన ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పెట్రోల్ బంకుల వద్ద రూ. 500, 1000 నోట్లను రెండ్రోజులపాటు తీసుకోవచ్చని కేంద్రం చెప్పినప్పటికీ నిర్వహణ లోపం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.